ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల మీడియా సర్కిల్స్లో ఎక్కడ చూసినా టీవీ-9 సీఈవో (తాజా మాజీ) రవిప్రకాష్ గురించే ఒక్కటే చర్చ నడుస్తోంది. ఓ సాధారణ జర్నలిస్టు స్థాయి నుంచి టీవీ-9 సీఈవో స్థాయికి ఎదిగిన రవిప్రకాశ్ టీవీ-9 లోపలా, బయటా చాలా రాజకీయాలే చేశాడని అంటుంటారు. చివరకు కేవలం 8 శాతం షేర్ల వాటాతో 90.5 శాతం షేర్ ఉన్న అలందా గ్రూప్ వారిని నియంత్రించాలని చూసి చాలా అవమనాకరీతిలో సీఈవో పదవి నుంచి వైదొలగాడు. టీవీ-9కు అప్పుడే కొత్త సీఈవో కూడా వచ్చేశాడు.
ఇక ఈ వివాదంలో రవిప్రకాశ్ను కొన్ని మీడియా సంస్థలు పగబట్టినట్టు ఆడేసుకుంటున్నాయి. గతంలో ఆయన ప్రత్యర్థులుగా ఉన్న వారు సోషల్ మీడియాలో రవిప్రకాశ్పై సెటైర్లు వేసుకుంటూ ఫుట్బాల్ ఆడుతున్నారు. ఇక గత రెండు రోజులుగా టీవీ-9 గురించి స్థానిక మీడియాలోనే కాకుండా జాతీయ మీడియా వర్గాల్లోనూ విస్తృతమైన చర్చలు నడుస్తున్నాయి.
ఇక ఈ విషయంపై జనసేన వర్గాలు పండగ చేసుకుంటున్నాయి. గతంలో శ్రీరెడ్డి ఇష్యూలో పవన్కు వ్యతిరేకంగా ఆయన కుటుంబాన్ని కించపరిచేలా మీడియాలో చాలా కథనాలు వచ్చాయి. పవన్ అమ్మను సైతం కించపరిచేలా వచ్చిన ఈ కథనాల వల్ల మీడియాపై సైతం కొన్ని వర్గాల్లో తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ కథనాలను కొన్ని ఛానెల్స్ పనికట్టుకుని మరీ ప్రచారం చేశాయి.
వీటిని ఖండిస్తూ నాడు జనసేన అధినేత పవన్ రవిప్రకాశ్పై చేసిన ట్వీట్లను ఇప్పుడు మరోసారి దుమ్ముదులిపి మరీ బయటకు తీసి జనసేనానులు రవిని ఆడుకుంటున్నారు. నాడు పవన్ చేసిన ట్విట్స్నే ఇప్పుడు ఆ పార్టీ వర్గాలు, పవన్ అభిమానులు రీ ట్వీట్లు చేస్తూ రవిప్రకాశ్ నీతులు చెప్పకు... నీతులు పొరుగువారికే కాదమ్మా...నీకు కూడా అంటూ తమ కసిని తీర్చుకుంటున్నారు.