మే 23.. ఇప్పుడు అందరి చూపూ ఈ తేదీపైనే.. ఇటు ఏపీ రాష్ట్రంలో.. అటు కేంద్రంలో రాజెవరో తేలేది ఆరోజే.. ఆ రోజు ఏం జరగబోతోందో ఏపీ సీఎం సింపుల్ గా తేల్చేశారు. మే 23న దేశ ప్రజలు ప్రధానిగా నరేంద్రమోడిని, అతని టీమ్ ను తిరస్కరించడం ఖాయమంటున్నారు. 


అంపైర్లు లేకుండా చేసి, రిఫరీ సిస్టమ్ నే ధ్వంసం చేసేలా వ్యవహరిస్తున్న మోడి టీమ్ కు పరాజయం ఖాయం. నిబంధనల ప్రకారం సక్రమంగా ఆడే కొత్త టీమ్ ను ప్రజలే ఎంపిక చేసుకుంటారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటారు, మోడిలాంటి వ్యక్తుల చేతిలో చిక్కుకోకుండా అంపైర్లను వారే కాపాడుకుంటారు అంటూ తాజాగా విజయనగరం పార్లమెంట్ సమీక్షలో చంద్రబాబు కామెంట్ చేశారు. 

 ఈ సందర్బంగా మోడీ సర్కారు తీరుపై, మోడీపై ఆయన మండిపడ్డారు. ఎన్నికల షెడ్యూల్ కు 73రోజులు తీసుకున్న ఈసి 50% వీవీ ప్యాట్ ల లెక్కింపునకు మరో 6రోజులు తీసుకోవడానికి ఎందుకంత అభ్యంతరం..? ఎన్నికల సంఘం ఎందుకు భయపడుతోంది..? నరేంద్రమోడి ఎందుకు భయపడుతున్నారు..? 50% వీవీ ప్యాట్ లు లెక్కించాలని ఈసిని ప్రతిపక్షాలు అడిగితే మోడికేం సంబంధం, ఆయనెందుకు ఉలిక్కిపడుతున్నారు..? అంటూ చంద్రబాబు ప్రశ్నించారు. 

ప్రధానమంత్రికి ఉండాల్సిన హోదా, గౌరవం, పవిత్రత నరేంద్రమోడికి లేవు. ఎప్పుడో చనిపోయిన నాయకులను, చివరికి నాయకుల కుటుంబ సభ్యులను కించపరిచేందుకు కూడా వెనుకాడరు. రాజకీయ లాభాల కోసం రక్షణ శాఖను, సైన్యాన్ని కూడా వాడుకుంటారు. విభజించి పాలించేందుకే మతాల మధ్య చిచ్చు రగిలిస్తారు. విద్వేష వ్యాఖ్యలు చేస్తారు. అధికారం కోసం వ్యవస్థలను పతనం చేస్తారు, రాజకీయ నాయకత్వాన్ని చంపేస్తారు. వీటన్నింటికీ మే 23న ప్రజాతీర్పే గుణపాఠం అవుతుందంటున్నారు చంద్రబాబు.



మరింత సమాచారం తెలుసుకోండి: