ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై సంచలన విమర్శలు వచ్చాయి. కీలకమైన ఎన్నికలు జరుగుతున్న తరుణంలో...ఆయనపై సంచలన ఆరోపణలు చేస్తూ, కలకలం రేకెత్తించే కథనం వెలువడింది. అమెరికాకు చెందిన టైమ్ మ్యాగజైన్ తన మే 20వ తేదీ సంచిక ముఖచిత్రంపై వివాదాస్పద శీర్షికతో భారత ప్రధాని మోదీ చిత్రాన్ని (క్యారికేచర్) ప్రచురించింది. ఈ చిత్రం పక్కన ఇండియాస్ డివైడర్ ఇన్ చీఫ్ (భారతదేశాన్ని విడగొట్టే నాయకుడు)గా పేర్కొంటూ శీర్షిక ప్రచురించడం జాతీయంగా, అంతర్జాతీయంగా చర్చనీయాంశం అవుతోంది.
ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యమైన భారతదేశంలో నివసిస్తున్న ప్రజలు మోదీ ప్రభుత్వాన్ని మరో 5 సంవత్సరాలు భరిస్తారా? అనే వాక్యాన్ని శీర్షికగా ఉంచారు. వ్యాసంలో మాజీ ప్రధాని జవహార్లాల్ నెహ్రూ లౌకిక భావాలు, మోదీ హయాంలో నెలకొన్న సామాజిక ఒత్తిళ్లను పోల్చారు. దేశంలో హిందూ, ముస్లింల మధ్య సోదరభావ వాతావరణాన్ని నెలకొల్పే ఉద్దేశమే మోదీ ప్రభుత్వానికి లేదన్న కోణంలో వ్యాసం సాగింది. ఈ వ్యాసాన్ని ఆతిశ్ తసీర్ రాశారు. వ్యాసం ఆసాంతం హిందూ-ముస్లింల సఖ్యత, సంబంధాలను వివరిస్తూ.. మోదీ హిందువుల పక్షపాతి అని రచయిత తన భావాలను వ్యక్తపరిచారు. భారతదేశ ఆర్ధిక సంస్కరణకు మోదీ చక్కని ఆశాకిరణం అని పేర్కొంటూ మోదీ ది రిఫార్మర్ పేరుతో కన్సల్టింగ్ సంస్థ యురేసియా గ్రూప్ వ్యవస్థాపకుడు, అధ్యక్షుడు ఇయాన్ బ్రెమర్ రాసిన కథనం కూడా ఇందులో ప్రచురితమైంది.