ఏడు విడుతల పోలింగ్‌లో ఆరో విడత పోలింగ్ నేడు జ‌రుగుతోంది. దేశరాజధాని ఢిల్లీతోపాటు మరో ఆరు రాష్ర్టాల్లోని 59 స్థానాలకు ఆదివారం పోలింగ్ జరుగనుంది. ఉత్తర్‌ప్రదేశ్‌లో 14, హర్యానాలో 10, బీహార్, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్‌లో ఎనిమిదేసి సీట్లు, ఢిల్లీలో ఏడు, జార్ఖండ్‌లో నాలుగు స్థానాలకు పోలింగ్ జరుగనుంది. ఈ విడుతలో 979 మంది అభ్యర్థులు బరిలో ఉండగా, 10.17 కోట్ల మంది ఓటర్లు వారి గెలుపోటములను నిర్ణయించనున్నారు. ఈ విడుత పోలింగ్ బీజేపీకి అత్యంత కీలకంగా మారింది. 


కేంద్ర మంత్రులు రాధామోహన్‌సింగ్, హర్షవర్ధన్, మేనకాగాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్, జ్యోతిరాదిత్య సింధియా తదితరుల భవితవ్యం ఈ ఎన్నికల్లో తేలిపోనుంది. 2014 నాటి ఎన్నికల్లో ప్రస్తుతం పోలింగ్ జరుగనున్న 59 స్థానాల్లో 45 సీట్లను బీజేపీ, 8 సీట్లను తృణమూల్ గెలుచుకున్నాయి. అలాగే రెండుసీట్లను కాంగ్రెస్, ఒక్కో సీటును ఎస్పీ, ఎల్జేపీ కైవసం చేసుకున్నాయి. బీజేపీ, తృణమూల్ పార్టీలు తమ స్థానాలను నిలబెట్టుకొనేందుకు ప్రయత్నిస్తుండగా, కాంగ్రెస్, ఎస్పీ ఈసారి తమ బలాన్ని పెంచుకొనేందుకు కృషి చేస్తున్నాయి. 


ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికలు జరుగనున్న 14 సీట్లలో బీజేపీ 2014లో 13 గెలిచింది. మిగిలిన ఒక్క సీటు ఆజంగఢ్‌లో ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయంసింగ్ యాదవ్ గెలుపొందారు. ఈసారి ఆ స్థానం నుంచి ఆయన కుమారుడు, ఎస్పీ అధ్యక్షుడు అఖిలేశ్ పోటీ చేస్తున్నారు. బీజేపీ నాడు గెలుచుకున్న ఫూల్‌పూర్, గోరఖ్‌పూర్ స్థానాలకు గత ఏడాది ఉప ఎన్నికలు జరుగగా, ఆ పార్టీ ఓటమిని చవిచూసింది. 1998 నుంచి 2017 వరకు గోరఖ్‌పూర్‌కు ప్రస్తుత యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రాతినిధ్యం వహించారు. దీంతో ఆ స్థానాన్ని తిరిగి గెలుచుకోవడం బీజేపీ ప్రతిష్ఠకు సంబంధించిన అంశంగా మారిపోయింది. సుల్తాన్‌పూర్ నుంచి పోటీచేస్తున్న కేంద్ర మంత్రి మేనకాగాంధీ తీవ్ర పోటీనెదుర్కొంటున్నారు. ఈ స్థానంలో బీజేపీ వ్యూహకర్తలు ఎస్పీ-బీఎస్పీ, కాంగ్రెస్ అభ్యర్థుల మధ్య ఓట్ల చీలికపై ఆధారపడుతున్నారు. 



మరింత సమాచారం తెలుసుకోండి: