సినిమా హీరోగా ఎంతో క్రేజ్ సంపాదించిన పవన్ కళ్యాన్ ప్రజలకు నేరుగా సేవ చేయాలనే ఆశయంతో ‘జనసేన’పార్టీ స్థాపించి ప్రజాక్షేత్రంలోకి వచ్చారు.  గత మూడు నెలలు అలుపెరుగకుండా ప్రచారం చేపట్టి పార్టీ, అభ్యర్థుల బాధ్యత తన భుజాన వేసుకొని ప్రచారం చేశారు.  గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలోని ‘జ‌న‌సేన’ కార్యాల‌యంలో పార్టీ త‌రఫున పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్య‌ర్థుల‌తో ముఖాముఖి స‌మావేశం నిర్వ‌హించారు.  ఈ సందర్భంగా పవన్ కళ్యాన్ మాట్లాడుతూ.. మార్పు మొద‌లైంది... అది అసెంబ్లీలో క‌న‌బ‌డుతుంది.. ఎంత? ఏంటి? అనే సంగ‌తి ప‌క్క‌న‌పెడితే జ‌న‌సేన పార్టీ బ‌లాన్ని త‌క్కువ‌గా అంచ‌నా వేయొద్దని అన్నారు.

  ‘జ‌న‌సేన బ‌లం తెలియ‌దు’ అన్న ప‌దం ఎవ‌రూ మాట్లాడ‌వ‌ద్ద‌ని, కొన్ని ల‌క్ష‌ల మంది యువ‌త వెంట ఉన్నార‌ని అన్నారు. పీఆర్పీ స‌మ‌యంలో అంతా ఆశ‌తో వ‌చ్చారు, ఆశ‌యంతో ఎవ‌రూ రాలేదు. జ‌న‌సేన పార్టీ మాత్రం ఆశ‌యాల‌తో ముందుకు వెళ్తుంది. నాకు ఓట‌మి భ‌యం లేదు, ఫ‌లితం ఎలా ఉంటుందనే భ‌యం లేదు.

ఎన్ని సీట్లు వ‌స్తాయన్న అంశం మీద దృష్టి పెట్ట‌లేదు. ఎన్ని సీట్లు గెలిచామ‌న్న దానికంటే, ఎంత శాతం ఓటింగ్ వ‌చ్చింది అన్న‌ది, ఎంత మందిని మార్పు దిశ‌గా క‌దిలించామ‌న్న‌దే ముఖ్యం. ముందుగా ఓట్లు వేసిన వేలాది మందిని గౌర‌వించండి.  ఇక ‘మార్పు’ మొద‌లైంది. అది మ‌న గెలుపు. ‘మార్పు’ అన్న‌ది గొప్ప అంశం, ఎమ్మెల్యే అన్న‌ది చిన్న అంశం అని గుర్తుపెట్టుకోండి’ అని అన్నారు. స్థానిక స‌మ‌స్య‌లు, స్థానిక ఎన్నిక‌లపై దృష్టి సారించాలని ఈ సందర్బంగా పవన్ కల్యాణ్ సూచించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: