వైసీపీ ఎంపీ, పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీకి పంటికింద రాయిలా మారిన సంగతి తెలిసిందే. ఎప్పటికప్పుడు తెలుగుదేశం పార్టీ నేతల తీరును తీవ్రంగా ఎండగడుతున్న ఆయన ఇటీవలి కాలంలో ట్విట్టర్ వేదికగా సైతం తీవ్రంగా స్పందిస్తున్నారు. అయితే, విజయసాయిరెడ్డి దూకుడును జీర్ణం చేసుకోలేని టీడీపీ నేతలు ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న కలకలం రేపే కామెంట్లు చేశారు. డేరా బాబాకు, విజయసాయి రెడ్డికి మధ్య సంబంధం ఏమిటో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ప్రజలు, రైతుల కోసం చంద్రబాబు ప్రాజెక్టులు కడుతుంటే చూసి ఓర్వలేకపోతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్నవ్యాఖ్యానించారు. ఎన్నికలు అయిపోయాక కూడా జగన్ సీఎం అయిపోతున్నాననే కలలు కంటున్నాడని, ఆయన అనుచరుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్ పులిగా మారి పిచ్చికూతలు కూస్తున్నాడని మండిపడ్డారు. జగన్ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నట్లుగా అందరూ అలాగే చేస్తారని భ్రమలో బతుకుతున్నారని ఆయన విమర్శించారు. మోడీ మాటల గారడీతో మోసపోయిన ప్రజలు ఇంటికి సాగనంపేందుకు సిద్ధమయ్యారు. ప్రజలు వాస్తవాలు గ్రహించారు, ఫ్యాన్ రెక్కలు విరిగిపోయేలా తీర్పు చెబుతారు. ప్రజలు ఇచ్చే తీర్పుతో జగన్, మోడీలు మూటాముల్లె సర్దుకోవడం ఖాయం. ఫలితాల తర్వాత జగన్ ఫ్యాన్ వాడటమే మానేస్తారు' అని బుద్దా వెంకన్న వ్యాఖ్యానించారు.
జగన్ తన అవినీతి పత్రిక, ఛానల్లో చంద్రబాబుపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని, దోచుకున్న డబ్బును దాచుకునేందుకు మోడీతో కుమ్మక్కయ్యాడని బుద్దా వెంకన్న ఆరోపించారు.``జైల్లో నేరగాళ్ల మధ్య స్నేహం మరింత విస్తరించింది. జగన్ అవినీతి కేసుల నుంచి బయట పడేందుకు మోడీ కాళ్లపై పడ్డారు. జగన్ కేసుల దర్యాప్తు వేగవంతంగా జరగకుండా మోడీ మోకాలడ్డుతున్నారు. అవినీతిని ఏరివేస్తానన్న మోడీ, జగన్ వంటి అవినీతి పరులకు అండగా నిలవడాన్ని ప్రజలు చీదరించుకుంటున్నారు.``అంటూ వ్యాఖ్యానించారు.