``నేను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాకుండా..ఎవరూ ఆపలేరు``జనసేన పార్టీ అధ్యక్షుడు, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా చేసిన సంచలన, కీలక వ్యాఖ్యలు. పోలింగ్ ఇంకా జరగకముందే...పవన్ ఇలా సంచలన జోస్యం చెప్పడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆలోచనలో పడేసింది. పవన్ ఎన్ని సీట్లలో గెలవనున్నారనే చర్చ జరిగింది. అయితే, పవన్ సీఎం పీఠంపై పవన్ ఆశలు వదిలేసుకున్నారనే ప్రచారం జరుగుతోంది. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తోందంటున్నారు.
మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో పార్టీ తరఫున పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీపి అభ్యర్ధులతో ముఖాముఖి సమావేశం నిర్వహించారు. రెండో విడత జరిగిన ఈ సమావేశంలో పాల్గొన్న అభ్యర్ధులు తమని తాము పరిచయం చేసుకుని, ఎలక్షనీరింగ్లో ఎదురైన అనుభవాలను పార్టీతో పంచుకున్నారు. అనంతరం అభ్యర్ధులను ఉద్దేశించి పవన్కళ్యాణ్ మాట్లాడుతూ...``ఎన్ని సీట్లు వస్తాయి అన్న అంశం మీద దృష్టి పెట్టలేదు. ఎంత పోరాటం చేశామన్న అంశం మీదే నా ఆలోచన. `` అని వ్యాఖ్యానించారు.
పొలిటికల్ ప్రాసెస్లో సహనం, ఓపిక అవసరం. గుండె ధైర్యం కావాలని పవన్ కోరారు. ``అంతా సంప్రదాయ రాజకీయాలు చేస్తున్నారు. నేను మాత్రం అలాంటి రాజకీయాలు చేయను. డబ్బు ఇచ్చి ఓట్లు కొనాలి అంటే ఇంత దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు. నేను ఓటమి లోతుల నుంచి బయటకు వచ్చాను. నాకు నిగ్రహం-నియమం ఉన్నాయి. ఎన్నో అవమానాలు, వెటకారాలు భరించాను. 2014లో జనసేన పార్టీ స్థాపించే సమయంలో ఎన్ని సీట్లు వస్తాయి అన్న ఆలోచన చేయలేదు. ఎక్కడో ఒక చోట మార్పు రావాలి అని మాత్రమే ఆలోచించాను. చాలా మంది సీటు గెలిచి మీకు గిఫ్ట్గా ఇస్తామంటున్నారు. ప్రజాస్వామ్యంలో అలాంటి పదాలకు తావులేదు. అంతా పార్టీ నిర్మాణం జరగాలి అని సలహాలు ఇస్తున్నారు. అది అంత తేలిక ప్రక్రియ కాదు. అన్ని పార్టీల్లా కూర్చుని వీరికి సెక్రటరీ, వారికి అది అని ఇచ్చే పదవులు ఇవ్వడం కాదు పార్టీ నిర్మాణం అంటే. కొత్తతరాన్ని తయారు చేస్తున్నాం. అంతా ఓ భావజాలనికి అలవాటుపడాలి. నన్ను అర్ధం చేసుకునే వారు కావాలి. దీర్ఘకాలిక ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నాం. `` అని వెల్లడించారు.