పెద్దల సాక్షిగా ఒక్కటి కాబోతున్న జంట ఆత్మహత్యకు పాల్పడింది. 20 రోజుల్లో పెళ్లి ఉంది.. ఈ క్రమంలోనే ఆ జంట ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా కంగ్టి మండలంలో చోటు చేసుకుంది.
మండలం చాప్టా.కె గ్రామానికి చెందిన కురుమ రవి(22), కురుమ అనిత(18) గత కొన్ని నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఒకే కులం కావడంతో వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారు. ఇరు కుటుంబాలు వారిని పెళ్లి చేయాలని నిర్ణయించారు. గత నెల 21న నిశ్చితార్థం కూడా చేశారు. ఈ నెల 30న పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేశారు పెద్దలు.
ఈ నేపథ్యంలో కురుమ రవి ప్రేమ వ్యవహారం, వారి కుటుంబ గురించి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఇటీవల సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు కామెంట్లు, పోస్టులు, అసభ్యకర కామెంట్లు చేసినట్లు తెలిసింది.
వాటిని చూసి మానసిక వేదనకు గురయ్యాడు రవి. తట్టుకోలేక పోయాడు. ఉదయం పొలానికి వెళ్లి చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.
మరోవైపు రవి ఆత్మహత్య చేసుకున్న వార్త విన్న కురుమ అనిత తన ఇంట్లో ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని బలవన్మరణానికి పాల్పడిందని పోలీసులు పేర్కొన్నారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.