నగరంలో మరో దారుణం జరిగింది. విడాకులు ఇవ్వాలని భార్యను వేధించాడు ఓ శాడిస్టు భర్త. దీంతో అతడి వేధింపులతో జీవితంపై విరక్తి చెందిన సదరు మహిళ ఆత్మహత్య చేసుకుంది.
మల్కాజ్గిరిలో నివాసం ఉండే ఆర్శ ఆకాశరావు, అల్వాల్ కు చెందిన సునీత ప్రేమించుకుని మరి పెళ్లి చేసుకున్నారు. 2005 లో వీరిద్దరు ప్రేమించుకుని కులాంతర వివాహం చేసుకున్నారు. ఆకాశరావు అమీర్పేటలోని ఓ కోచింగ్ సెంటర్లో విద్యార్థులకు శిక్షణ ఇస్తాడు.సునీత గృహిణి. వీరికి ఇద్దరు పిల్లలున్నారు.
కాగా.. రెండేళ్లుగా ఆకాశరావు భార్యను విడాకులు ఇవ్వమని అడుగుతున్నాడు. ప్రేమించి పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్న ఆకాశరావు బలవంతంగా విడాకులు తీసుకునేందుకు భార్యను ప్రతి రోజు వేధింపులకు గురి చేసేవాడు. ఈనేపథ్యంలో వారం రోజుల క్రితం దంపతుల మధ్య గొడవ జరిగింది.
గొడవ జరగడంతో సునీత తన ఇద్దరు పిల్లల్ని తీసుకుని అల్వాల్లోని తన పుట్టింటికి వెళ్లింది. అయితే శనివారం సాయంత్రం మాట్లాడుకుందాం రమ్మని భర్త సునీతకు ఫోన్ చేశాడు. దీంతో ఆమె ఒంటరిగానే చేరుకుంది. వారి మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ.. ఆదివారం సునీత తలుపులు ఎంతకూ తీయలేదు.
దీంతో ఈ విషయాన్ని ఆమె సోదరికి ఆకాశరావు ఫోన్ చేసి చెప్పాడు. హుటాహుటినా అక్కడకు చేరుకున్న తలుపు కొట్టారు. ఎంతకు తీయలేదు. దీంతో వారు వెనుకవైపు నుంచి లోపలికి చూడగా.. సునీత ఉరివేసుకుని కనిపించింది. తలుపులు పగులగొట్టి లోపలకు వెళ్లగా అప్పటికే ఆమె మృతిచెందింది.
మృతురాలి తల్లి ఫిర్యాదు మేరకు ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసలు శనివారం రాత్రి భార్యా భర్తల మధ్య ఏం జరిగిందనేది పోలీసులు విచారిస్తున్నారు. ఆత్మహత్య చేసుకున్న టైమ్లో అసలు భర్త ఎక్కడకు వెళ్లాడు. అన్న కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.