ఏపీ సీఎం, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోమారు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలుపు ఓటములపై హాట్ హాట్ జరుగుతున్న తరుణంలో బాబు అనూహ్యమైన కామెంట్లు చేశారు. నంద్యాల లోక్ సభ నియోజకవర్గ నేతలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉండవల్లిలోని ప్రజావేదిక దగ్గర నిర్వహించిన ఈ సమావేశానికి పలువురు నేతలు హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఏపీ అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో పోలింగ్ సరళి, కౌంటింగ్ సందర్భంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై టీడీపీ శ్రేణులకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. అలసత్వానికి అవకాశం ఇవ్వరాదనీ, కౌంటింగ్ ముగిసేవరకూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నాలుగు రకాల సర్వేలు చేయించాననీ, అన్నింటిలో టీడీపీనే విజయం సాధిస్తుందని తేలిందని చంద్రబాబు అన్నారు.
ప్రకృతి మనకు బాగా కలసివచ్చిందని లబ్ధిదారులకు చేయాల్సినంత సంక్షేమం చేశామన్నారు. ``వాస్తవానికి ఈ ఎన్నికలు మే నెలలో రావాలి… కానీ తొలిదశలోనే ఎన్నికలు పెట్టి మనల్ని ఇబ్బంది పెట్టాలని చూశారు. తక్కువ గడువు ఇచ్చి టీడీపీని దెబ్బతీయాలనుకున్నారు. కానీ ఇదే టీడీపీకి కలిసి వచ్చింది. చెడు చేయాలనుకున్నా, మంచే జరిగింది. మే 23న కౌంటింగ్లో టీడీపీ గెలుపు లాంఛనం మాత్రమే`` అని చంద్రబాబు అన్నారు.
టీడీపీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్షగా నిలిచాయని అభిప్రాయపడ్డారు. ఎన్నికలు ప్రతీ ఐదేళ్లకు ఓసారి వస్తుంటాయనీ, పార్టీ శాశ్వతమన్నారు బాబు. ఎన్నికల్లో పోటీచేయడం ఒక్కటే ముఖ్యం కాదని అభిప్రాయపడ్డారు. త్వరలోనే స్థానిక సంస్థల ఎన్నికలు కూడా రాబోతున్నాయన్నారు. రాష్ట్ర, దేశ రాజకీయాలను టీడీపీ నేతలంతా అధ్యయనం చేయాలని సూచించారు.