మొన్నటి వరకు ఏపి, తెలంగాణలో ఎన్నికల హడావుడి ఓ రేంజ్ లో కొనసాగింది. ముఖ్యపార్టీ నాయకులు నువ్వా..నేనా అనే విధంగా ప్రచారాలు చేసిన విషయం తెలిసిందే. గత నెల 11న తెలంగాణ, ఏపిలో దేశ వ్యాప్తంగా మరికొన్ని నియోజక వర్గాల్లో పోలింగ్ జరిగింది. నేతల జాతకాలు ఈవీఏంలో ఉన్నాయి..అయితే ఈవీఎం భద్రతపై గట్టి ఏర్పాటు చేశారు. లోక్సభ ఓట్ల లెక్కింపు సజావుగా, ప్రశాంత వాతావరణంలో జరిగేలా రాజకీయ పార్టీల ప్రతినిధులు సహకరించాలని జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఎం.హన్మంతరావు కోరారు.
ఈ నెల 23న ఉదయం 8 గంటల నుంచి రద్రారం వద్ద గల గీతం (డీమ్డ్) యూనివర్సిటీలో ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అభ్యర్థుల ఎన్నికల ఏజెంటు, ఆయా పార్టీల కౌంటింగ్ ఏజంట్లు ఉదయం 6 గంటల లోపు కౌంటింగ్ సెంటర్కు చేరుకోవాలని సూచించారు. మొదట పోస్టల్ బ్యాలెట్, సర్వీస్ ఓట్ల లెక్కింపు జరుగుతుందని అనంతరం, ఈవీఎంల ఓట్లు లెక్కిస్తారని కలెక్టర్ హన్మంతరావు పేర్కొన్నారు. 23న ఓట్ల లెక్కింపు కోసం గీతం యూనివర్సిటీ వద్ద పకడ్బందీ ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు.
నియోజకవర్గానికి సంబంధించి 7 అసెంబ్లీ నియోజకవర్గాలైన జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్, కామారెడ్డి, ఎల్లారెడ్డి, జూక్కల్, బాన్సవాడల ఓట్ల లెక్కింపు గీతంలోని 3,4,5,6వ అంతస్తుల్లో ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపునకు ప్రతి నియోజకవర్గానికి 14 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఆయా రాజకీయ పార్టీల అభ్యర్థులు తమ కౌంటింగ్ ఏజెంట్ల వివరాలను, వారికి సంబంధించిన 3 పాస్పోర్టు సైజ్ఫొటోలను 15లోగా రిటర్నింగ్ అధికారికిగాని, ఆయా నియోజకవర్గ ఏఆర్వోకుగాని అందజేయాలన్నారు.
ఫారం – 18లో ఇస్తూ, డిక్లరేషన్ను అందజేయాలని స్పష్టం చేశారు. ఓట్ల లెక్కింపును అధికారులు జాగ్రత్తగా చేపట్టాలని సూచించారు. ఈ సమావేశంలో అభ్యర్థులు, ఆయా పార్టీల ఎన్నికల ఏజెంట్లు పాల్గొన్నారు. పోలీసు శాఖ ద్వారా కౌంటింగ్ ఏజెంట్లకు సంబంధించిన పూర్వ సంఘటనలు, ప్రవర్తన నివేదిక మేరకు సంబంధితులకు కౌంటింగ్ పాస్లు జారీ చేస్తామని కలెక్టర్ తెలిపారు.