తెలంగాణలో గత నెల ఇంటర్ ఫలితాలు వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే ఆ ఫలితాలన్నీ తప్పుల తడకగా రావడంతో 25 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. తాము ఎంతో కష్టపడి రాసినా సింగిల్ డిజిట్ మార్కులు రావడంపై విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యార్థి సంగాలు, రాజకీయ నాయకులు మూకుమ్మడిగా ఇంటర్ బోర్డు పై విరుచుకుపడ్డారు. దాంతో ఈ విషయంలో స్వయంగా సీఎం కేసీఆర్ కలుగ జేసుకొని త్రిసభ్య కమిటీ వేశారు.
ఇక త్రిసభ్య కమిటీ నివేదిక ప్రకారం ఇంటర్ బోర్డు, గ్లోబరినా ప్రైవేట్ సంస్థల నిర్లక్ష్యం వల్లే ఈ తప్పిదాలు జరిగాయిని తెల్చి చెప్పింది. దాంతో ఫెయిల్ అయిన మూడు లక్షలకు పైగా విద్యార్థులు పేపర్లు రీ వాల్యూవేషన్, రీ వెరిఫికేషన్ చేయాలని ఇంటర్ బోర్డుకి ఆదేశాలు వచ్చాయి. తాజాగా ఇంటర్ రీ వెరిఫికేషన్ ఫలితాలను ఈ నెల 27 న ప్రకటించాలని బోర్డును హైకోర్టు ఆదేశించింది.
ఇంటర్ వివాదంపై గ్లోబరినా సంస్థకు హైకోర్ట్ నోటీసులు జారీ చేసింది. ఇంటర్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల రీ కౌంటింగ్ పూర్తి చేశామని ఇంటర్ బోర్డు కోర్టుకు తెలిపింది. రేపు ఫలితాలను ప్రకటిస్తామని చెప్పింది. కోర్టు మాత్రం.. ఫలితాలు, సమాధాన పత్రాలను ఈ నెల 27 న ఒకేసారి ప్రకటించాలని బోర్డుకు సూచించింది. తదుపరి విచారణను జూన్ 6 కు వాయిదా వేసింది.