ఏపీలో ఇప్పటికి మూడు జిల్లాల్లో ఐదు పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించారు. ఈ నెల 6న గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాలలోని ఐదు పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ జరిగింది. దాంతో సరి అనుకున్నారంతా. ఇపుడు మళ్ళీ రీపోలింగునకు ఈసీ ఆదేశాలు జారీ చేసింది. దాంతో మరో మారు ఏపీలో ప్రజలు ఓటెత్తనున్నారు.
చిత్తూరు జిల్లాలోని చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు చోట్ల రీపోలింగ్కు కేంద్ర ఎన్నికల సంఘం ఈ రొజు ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం ప్రిన్సిపల్ సెక్రటరీ ఎస్కే రుడోలా కొద్ది సేపటి క్రితం నోట్ విడుదల చేశారు. ఈ నెల 19న ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు చంద్రగిరి నియోజకవర్గంలోని ఐదు పోలింగ్ కేంద్రాల్లో(అసెంబ్లీ, పార్లమెంటు స్థానాలకు) రీపోలింగ్ జరగనుంది.
321-ఎన్ఆర్ కమ్మపల్లి, 104- పులివర్తి వారి పల్లి, 316- కొత్త ఖండ్రిగ, 318-కమ్మపల్లి, 313-వెంకట రామాపురం పోలింగ్ కేంద్రాల్లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం స్పష్టంగా పేర్కొంది. ఈ మేరకు ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని వెల్లడించింది. చంద్రగిరిలో వైసీపీ అభ్యర్ధిగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఉన్నారు. మరో వైపు టీడీపీ నుంచి పులవర్తి వెంకటమణి ప్రసాద్ (నాని) పోటీలో చేస్తున్నారు. ఇక్కడ గట్టి పొటీ ఉంది. మరి ఇక్కడ పోలింగ్ జరిగితే ఎవరికి లాభం నష్టమన్న చర్చ మొదలైంది.