పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో హింసాత్మక సంఘటనలు చోటుచేసుకోవడంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. పశ్చిమ బెంగాల్లో ప్రస్తుతం నడిచేది గుండా స్వామ్యం (గుండారాజ్ ) అని ఇందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీయే బాధ్యురాలని ధ్వజమెత్తారు. పశ్చిమ బెంగాల్ కన్నా కశ్మీరులోనే ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతున్నాయని అన్నారు.
తనను విభజనవాదిగా విమర్శించినవారిని చూసి జాలిపడుతున్నట్లు చెప్పారు. ‘టైమ్’ మ్యాగజైన్లో ‘విభజనవాది మోదీ’ శీర్షికతో వచ్చిన కథనంపై ఒక ఆంగ్ల వార్తాచానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన స్పందించారు. ‘తమ ప్రతిష్ఠను పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్న కొందరు వ్యక్తులు గత 20 ఏళ్లుగా నా ప్రతిష్ఠను దెబ్బ తీసేందుకు విఫల యత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ, వారి ప్రతిష్ఠే మంటగలిసింది’ అని వ్యాఖ్యానించారు. ఆ పత్రికలో పేర్కొన్నట్లు ‘విభజన’ అడ్డంగా లేక నిలువుగా జరిగిందా? అన్నది అర్థం చేసుకోవాలన్నారు.
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రజాస్వామ్యాన్ని గూండాక్రసీ గూండాస్వామ్యం గా మార్చేశారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా ధ్వజమెత్తారు. తృణమూల్ గూండాలు రాష్ట్ర ప్రజలకు ప్రతి రోజు నరకం చూపిస్తున్నారని, ఈ ధోరణి ఇకపై ఎంతమాత్రం చెల్లదని స్పష్టంచేశారు. అధికారంలో కొనసాగే హక్కు మమత బెనర్జీ కు లేదన్నారు. కోల్కతాలో రాజకీయ హింస నేపథ్యంలో ఆయన ఈ వ్యాఖ్య చేశారు. బెంగాల్లో అత్యయిక పరిస్థితి తరహా వాతావరణాన్ని మమత తీసుకువచ్చారని, ప్రతీదీ నాశనం చేయడమే ఆమె లక్ష్యమని మోదీ ఆరోపించారు. వేధింపుల సర్కారును సాగనంపడానికి బెంగాల్ ప్రజలు నిర్ణయించుకున్నారని చెప్పారు. బుధవారం పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, బిహార్ లో వివిధ ఎన్నికల సభల్లో నరేంద్ర మోదీ ప్రసంగించారు.
గడిచిన ఏడుదశాబ్ధాలుగా ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నవారు ముస్లింలపై బెదిరింపులకు పాల్పడ్డారని, నిందను మాత్రం ఇతరులపైకి, ఇతర సంస్థల పైకి నెట్టివేస్తూ రాజకీయాలు చేశారని ఆరోపించారు. పశ్చిమ బెంగాల్ లో రగులుతున్న హింసాకాండపై కొందరు మౌనం వహించడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఆక్షేపించారు. పశ్చిమ బెంగాల్లో ఒక బీజేపీ ముఖ్యమంత్రి హెలికాప్టర్ దిగడానికి కూడా ముఖ్యమంత్రి మమత అంగీకరించ లేదని, బీజేపీ ర్యాలీలకు అనుమతివ్వలేదని, ఆమెకు ఎవరన్నా లెక్కలేదని ధ్వజమెత్తారు.
‘బెంగాల్లో భాజపా ఎదుగుదలను చూసి మమత వణికిపోతున్నారు. అధికార మత్తుతో ప్రజాస్వామ్యం గొంతు నులమాలని ప్రయత్నిస్తున్నారు. డైమండ్ హార్బర్ నుంచి పోటీ చేస్తున్న మమత మేనల్లుడు అభిషేక్ బెనర్జీ దుకాణం మూతపడడం ఖాయం’ అని చెప్పారు.
"దీదీ! మీరు చిత్రకారిణి అని, మీ కళాఖండాలు కోట్లు రూపాయలు రాబట్టాయని విన్నాను. అసహ్యకరమైన రీతిలో నా చిత్రాన్నీ గీసి బహుమతిగా మా ఇంటికి తీసుకురండి. జీవితాంతం దాచుకుంటాను. మీపై కేసు పెట్టను లెండి" అని మోదీ వ్యంగ్యంగా అన్నారు. మమత చిత్రాన్ని ఫేస్బుక్ లో మార్ఫింగ్ చేశారనే ఆరోపణపై భాజపా మహిళా కార్యకర్తని అరెస్టు చేసిన వైనం గురించి ఆయన పరోక్షంగా ప్రస్తావించారు. బెంగాల్లో 42 లోక్సభ స్థానాలనూ భాజపా గెలుచుకుంటుందని, వీటితో కలిపి తమ స్థానాలు 300 దాటిపోతాయని ధీమా వ్యక్తంచేశారు.
యాదవపూర్ లో ప్రసంగిస్తూ సందర్భానుసారంగా యదు వంశీయులతో తనకు అవినాభావ సంబంధం ఉందని ప్రధాని చెప్పారు. "మోహన్దాస్ కరమ్చంద్ గాంధీ ఉపయోగించిన చరఖాకు మనం ప్రణమిల్లుతాం. ఉగ్రవాదంపై పోరాడాల్సి వచ్చినప్పుడు కృష్ణుడు ప్రయోగించిన సుదర్శన చక్రాన్ని గుర్తుపెట్టుకుంటాం. వేణువు ఎక్కడ ఆలపించాలో? సుదర్శన చక్రం ఎక్కడ ప్రయోగించాలో? తెలిసిన కృష్ణుడిని యాదవులు ఆరాధిస్తారు" అని చెప్పారు.