రాజకీయాల్లో సమయం కలసి రావాలి. సరైన సమయంలో సరైన విధంగా సరైన నిర్ణయం తీసుకుంటే రాజకీయాల్లో నిలదొక్కుకోవచ్చనేది బాగా ప్రచారంలో ఉన్న మాట. అది యూపీఏ, చైర్ పర్సన్ సోనియాగాంధీకి చెల్లుతుంది. ఆమె అదృష్టమో? లేక కాలం కలిసివచ్చిందో? తెలియదు గానీ, పదేళ్లపాటు దేశ రాజకీయాలను శాసించారు. రాజకీయాల్లో ఏం చేసినా సరైన సమయానికి సరిగా స్పందించటం ముఖ్యం. దీన్నే “టైమింగ్ “ అంటారు. సరైన టైమింగ్ అనుసరిస్తూ కనుసైగతో దేశాన్ని ఒక దశాబ్ధం పరిపాలించారు.
ఆ తర్వాత ప్రధాని నరేంద్రమోదీకి ఇలాంటి పరిస్థితే. గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నఆయన నక్కతోక తొక్కి వచ్చారో? ఏమో? తెలియదు కానీ, ప్రధాని అభ్యర్థిగా బీజేపీ ప్రకటించడం ఆ తర్వాత ప్రధాని పీఠాన్ని అధిరోహించడం చకచకా జరిగిపోయాయి.
రాజకీయాలలో ఎప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో ఊహించడం కూడా కష్టం అన్నట్లు ఇప్పుడు యూపీఏ, ఎన్డీఏలకు గడ్డు కాలం దాపురించింది. ఈసారి సార్వత్రిక ఎన్నికల్లో కేంద్రంలో ఏ వర్గానికి పూర్తి మెజారిటీ రాదని హంగ్ వస్తుందనే సంకేతాలు బలంగా కనిపిస్తున్నాయి. దేశ వ్యాప్తంగా అనేక సర్వేలు సైతం ఇదే స్పష్టం చేస్తున్నాయి.
ఈసారి కూడా మళ్లీ తామే అధికారంలోకి రావాలంటూ బీజేపీ గట్టిగానే పావులు కదుపుతుంది. అందుకు వ్యూహాలను సైతం సిద్ధం చేసింది. యూపీఏ పరిస్థితి అలా ఉంటే
— ఎన్డీఏను ఎలాగైనా గద్దెదించాలని కాంగ్రెస్ పార్టీ ఏకంగా 21 పార్టీలతో జతకట్టి వ్యూహరచన చేస్తోంది. రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు అంటూ ఉండ రంటారు అన్న సామెతను నిజం చేస్తూ కాంగ్రెస్ పార్టీకి బద్దశత్రువుగా పురుడు పోసుకున్న తెలుగుదేశం పార్టీతో జతకట్టింది. ఒకప్పటి రాజకీయ శత్రువులు ఆకస్మాత్తుగా మిత్రులు కూడా అయిపోవచ్చు అనడానికి ఇదే నిదర్శనం. 2014 ఎన్నికల్లో ఎన్డీయేకు మద్దతు పలికిన అవకాశవాద రాజకీయవాది చంద్రబాబు 2019 ఎన్నికలు వచ్చేసరికి యూపీఏకు మద్దతు పలికారు. ఈ ఇరవై ఒక్క పార్టీల ప్రధాన ధ్యేయం ప్రధాని నరేంద్ర మోడీని గద్దెదింపటం ప్రధానం ప్రజాశ్రేయస్సు ఏ మాత్రమూ కాదని జగమెరిగిన సత్యం. కావాలంటే ప్రధాని పదవి కూడా కోల్పోవటానికి కాంగ్రెస్ అధినేత సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. బిజేపిని అధికారానికి దూరంలో ఉంచటానికి రాహుల్ గాంధి ఏ స్థాయికి దిగజారారో దేశప్రజలందరికీ తెలుసిన విషయమే. మెజారిటీ ఇచ్చి గౌరవిస్తే మైనారిటీకి మద్దతిచ్చి అధికారానికి దూరం జరిగిన కాంగ్రెస్ ప్రజలు కోరుకున్న పాలన ఇవ్వటం లేదు.
ఇకపోతే ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రావాలన్న పట్టుదలతో ఉన్న కాంగ్రెస్ పార్టీ అందుకు కలిసి వచ్చే పార్టీలను ప్రసన్నం చేసుకునే పనిలో పడింది. యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ నేరుగా రంగంలోకి దిగారు. ఆయా పార్టీల అధినేతల మద్దతు కూడగట్టే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహనరెడ్డిలకు లేఖలు సైతం రాశారంటూ ప్రచారం జరుగుతుంది.
తమకు ఎలాంటి లేఖలు రాలేదంటూ అటు టీఆర్ఎస్, ఇటు వైసీపీ స్పష్టం చేస్తోంది. అయితే సోనియా గాంధీయే నేరుగా ఆ పార్టీల అధినేతలతో మాట్లాడుతున్నా రంటూ మరో వార్త సుడిగాలిలా ప్రచారం అవుతుంది. వైసీపి అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డికి యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీ లేఖ రాశారంటూ వస్తున్న వార్తలపై సోషల్ మీడియాలో సెటైర్లు వైరల్ అయ్యాయి. యూపీఏ చైర్ పర్సన్ హోదాలో ఉన్న సోనియాగాంధీ అధికారంలో వైసిపీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డిని నానా ఇబ్బందులకు గురి చేశారని వైసీపీ నేతలు విమర్శిస్తున్నారు.
వైఎస్ జగన్మోహనరెడ్డి పై అక్రమాస్తుల కేసులను కుట్రపూరితంగా బనాయించింది కాంగ్రెస్ పార్టీయే నని విమర్శిస్తున్నారు. ఆనాడు అధికారం చేతిలో ఉంచుకొని టిడిపి అధినేత చంద్రబాబు నాయుడి సహకారంతో తమ నేతను ఇబ్బందులకు గురిచేసి జైల్లో పెట్టించి ఇప్పుడు మద్దతు కోరతారా! అంటూ మండిపడుతున్నారు. “ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావటం” అంటే ఇదేనేమో అంటూ సెటైర్లు వేస్తున్నారు.
ఇదిలా ఉంటే సోనియాగాంధీ లేఖ రాసినా లేకపోతే వైఎస్ జగన్మోహనరెడ్డితో నేరుగా ఫోన్ లో మాట్లాడినా జగన్మోహనరెడ్డి మాత్రం యూపీఏకు మద్దతు ఇచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. తనను కాంగ్రెస్ పార్టీ పెట్టిన ఇబ్బందులను వైఎస్ జగన్మోహనరెడ్డి మరచిపోవటానికి ఆయన పచ్చి అవకాశవాది చంద్రబాబాబు నాయుడు లాంటి వారు కాదని, అంటున్నట్లు తెలుస్తుంది.
ఈ నేపథ్యంలో యూపీఏకు మద్దతు ఇచ్చే ప్రసక్తే లేదని మరోవైపు తమ రాజకీయ ప్రత్యర్థి అయిన చంద్రబాబు యూపీఏలో కీలక పాత్ర పోషిస్తున్న తరుణంలో యూపీఏకు మద్దతివ్వడం కంటే మించిన పొరపాటు వేరేమీ ఉండదని వైఎస్ జగన్మోహనరెడ్డి తన అనుచరులు వద్ద అన్నట్లు తెలుస్తోంది. అందుకే సోనియాగాంధీ ఆహ్వానిస్తే ఢిల్లీ వెళ్లడానికి తమ నేత ఏమైనా చంద్రబాబు నాయుడా? అంటూ వైసీపీ నేతలు సెటైర్లు వేస్తున్నారు.