నూట ముప్పైయేళ్ళ సుధీర్ఘ రాజకీయ ప్రయాణంలో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం పేలవంగా ముగిసింది. ఒక సినిమా రక్తికట్టాలంటే బాగా ఆడాలంటే పేరున్న హీరో, హీరోయిన్లు, ఇతర తారాగనం, కళ్లు చెదిరే గ్రాఫిక్కులు, అద్భుతమైన సణ్=గీతం మాత్రం ఉంటేనే సరిపోదు. ఆ సినిమాకు సంబంధించిన కథను తెరపై సన్నివేశాలత్గో పండించే కథనం అద్భుతంగా ఉండాలి. ఉన్న చిన్న కథనే ప్రేక్షకులను సమ్మోహనం చేసేలా కట్తిపడేసేలా చెప్పగలిగే నేర్పుండాలి.
ప్రస్తుత ఎన్నికల్లో అధికార పార్టీల సమాఖ్య ఎన్డీయే ప్రధాన పోటీదారు కాంగ్రెస్ పరిస్థితి కథనం లోపించిన బిగువుసడలిన సినిమా కథ లాగానే ఉందని హైదరాబాద్కు చెందిన "పీపుల్స్ పల్స్ రీసెర్చి ఫౌండేషన్" క్షేత్ర స్థాయి పరిశీలన తేలింది. కాంగ్రెస్ ను అతిపెద్ద పార్టీగా అవతరింప జేయడంలో రాహుల్ గాంధి విఫలమయ్యారని, ఎన్డీయే ప్రభుత్వ వైఫల్యాలను సరిగా ప్రజల్లోకి తీసుకెళ్లలేక పోయారని తేలింది.
కాంగ్రెస్ "సినిమా" లో "కథనం" లోపించింది. ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీ ని గద్దె దింపటం గురించి తప్ప ఇతరత్రా విలువైన ప్రజలలో ఉన్న అసంతృప్తిని బయట పడేసే విషయాల గురించీ ఆ పార్టీ మాట్లాడలేదు. కానీ నిజం ఏమిటంటే నరేంద్ర మోదీ ఒక్కరే కీలక విషయం కాలేరు. ఎందుకంటే ఒక వ్యక్తి లక్ష్యంగా చేసే వ్యతిరేక ప్రచారం వల్ల పొంద గలిగేదేమీ ఉండదు. అలాగని రాహుల్ గాంధి మౌనంగా ఏమీ లేరు. నిన్న మొన్నటి బాలాకోట్ వైమానిక దాడుల వరకు ఆయన నరేంద్ర మోదీ ప్రభుత్వ లక్ష్యంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు. అయితే ఒక ప్రత్యామ్నాయ అజెండాను ప్రజల ముందుంచడంలో ఆయన విఫలమయ్యారు.
"సూటు బూట్ల ప్రభుత్వం"
"గబ్బర్సింగ్ ట్యాక్స్"
"చౌకీదార్ చోర్ హై" వంటి చెణుకులు బాగానే పేలాయి. ప్రజల్లోకి కూడా బాగానే వెళ్లాయి.
కానీ పదే పదే అవే వ్యాఖ్యలు చేస్తుండటంతో రాను రానూ పాతబడి అరిగిపోయిన దలేర్ మెహిందీ, బాబా సెహగల్ పాప్ సంగీతం లాగా విన్పించడం మొదలయ్యింది. మరోవైపు రఫేల్ కుంభకోణం క్షేత్రస్థాయి లోకి వెళ్లలేదని వెల్లడయ్యింది. భ్రమలు తొలగి పోయి నరేంద్ర మోదీపై ఆగ్రహంతో ఉన్న ఓటర్లే తమ వద్దకు రావాలన్నట్టుగా ఆ పార్టీ కార్యకర్తలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇంకా ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే సామాన్యుల్ని కష్టాల పాలు చేసిన నోట్ల రద్దు అంశాన్ని తెరపైకి తేవడంలో కూడా కాంగ్రెస్ విఫలమయ్యింది.
అలాగే ఏపీ, తెలంగాణలతో పాటు ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్తాన్, మధ్యప్రదేశ్ గ్రామీణ ప్రజల్లో తీవ్ర అసంతృప్తిని, రైతులకు కనీస మద్దతుధర అనేదే ప్రధానాంశంగా ఉండటాన్ని పీపుల్స్ పల్స్ గమనించింది. ఈ అంశాలు కూడా అంతగా హైలైట్ కాలేదు. ₹65000 కోట్ల రైతు ఋణాల మాఫీకి సంబంధించి యూపీఏ–1 నిర్ణయాన్ని కూడా పెద్దగా పట్టించు కోలేదు. నరేంద్ర మోదీ ప్రభుత్వ అతిపెద్ద వైఫల్యం నిరుద్యోగ సమస్య ను కూడా కాంగ్రెస్ ఉపయోగించుకోలేక పోయింది. మాటకు కట్టుబడి ఉంటామనే హామీ ఇవ్వడం తప్ప అధికారంలోకి వస్తే వచ్చే ఐదేళ్లలో ఏం చేస్తామో? వివరించలేదు. ధరల పెరుగుదల అంశాన్నీ కాంగ్రెస్ పెద్దగా లేవనెత్త లేదు. మరోవైపు కాంగ్రెస్ ప్రచారంలోకి తెచ్చిన "న్యాయ్" గురించి పార్టీ అభ్యర్థులు కానీ, కార్యకర్తలు కానీ ప్రస్తావించ లేదు. చాలామందికి దాని గురించే తెలియదంటే అతిశయోక్తి కాదు.