ఇక ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పని ఖేల్ఖతం కావడంతో ఆ పార్టీని వదిలిన కోట్ల ఫ్యామిలీ రాజకీయ మనుగడ కోసం టీడీపీని ఆశ్రయించింది. పార్టీ మారడానికి ముందు కోట్ల ఆరేడు నెలలుగా ఏ పార్టీలో చేరాలా ? అని బాగా నాన్చి నాన్చి చివరకు సైకిల్ ఎక్కేశారు. వాస్తవంగా చూస్తే కోట్లకు జగన్ బంపర్ ఆఫర్ ఇచ్చారు. పార్టీలో చేరితే కర్నూలు ఎంపీ సీటుతో పాటు ఆయన భార్య సుజాతమ్మ, కుమారుడు రాఘవేందర్రెడ్డికి ఆలూరు, పత్తికొండ, కర్నూలు అసెంబ్లీ సీట్లలో ఎక్కడో ఓ చోట ఎడ్జెస్ట్ చేస్తానని చెప్పారు. కోట్ల జగన్ ఆఫర్ కాదని చంద్రబాబు చెంతకు చేరారు.
కర్నూలు జిల్లాలో వైసీపీ బలం తిరుగులేదు. ఈ విషయాన్ని ఎవరైనా అంగీకరించాల్సిందే. అందులోనూ గత రెండుసార్లు ఇక్కడ ఎంపీ సీటు వైసీపీ బీసీలకు ఇవ్వడంతో..ఈ నియోజకవర్గ పరిధిలో బలంగా ఉన్న పద్మసాలీలు అందరూ వైసీపీ అభ్యర్థులనే గెలిపించాలని డిసైడ్ అయ్యారు. అందుకే గత ఎన్నికల్లో ఈ వర్గానికే చెందిన బుట్టా రేణుక గెలిస్తే.. ఈ సారి మళ్లీ అదే పద్మసాలీ వర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన డాక్టర్ సంజయ్కుమార్ గెలుపు బాటలో ఉన్నారు. కోట్లకు సపరేట్ వర్గం ఉన్నా ఆయన సైకిల్ ఎక్కడాన్ని జీర్ణించుకోలేని వారంతా వైసీపీ బాట పట్టారు. దీనికి తోడు జగన్ క్యాస్ట్ ఈక్వేషన్ కూడా ఇక్కడ కోట్ల ఓటు బ్యాంకుకు గండిపెట్టింది.
దీనికి తోడు కర్నూలు జిల్లాలో కేఈ వర్సెస్ కోట్ల ఫ్యామిలీ మధ్య వైరుధ్యంతో వీళ్లు పైన కలిసినా జిల్లాలో ఈ రెండు వర్గాల నాయకులు మాత్రం అంతగా కలిసిపోలేదు. ఇక ఆలూరులో కోట్ల భార్య సుజాతమ్మ రంగంలో ఉన్నారు. అక్కడ బీసీ అభ్యర్థిని కాదని చంద్రబాబు ఆమెకు సీటు ఇవ్వడంతో అక్కడ బీసీలంతా ఏకమైన సుజాతమ్మకు యాంటీగా వైసీపీకి ఓట్లేసినట్టు పోలింగ్ సరళి చెప్పేసింది. ఏదేమైనా తన రాజకీయ భవిష్యత్తు కోసం జగన్ బంపర్ ఆఫర్ కాదని... బాబును నమ్మి టీడీపీ నుంచి పోటీ చేసిన కోట్ల దంపతులు ఈ ఎన్నికల్లో ఓడిపోతే వారిద్దరు రాజకీయంగా రిటైర్మెంట్ అవ్వడంతో పాటు తమ కుమారుడి భవిష్యత్తును కూడా అగాధంలోకి నెట్టేసిన వారే అవుతారు.