కేంద్ర మాజీ మంత్రి
సాయిప్రతాప్ భోరుమన్నారు. కడప జిల్లాలోని రాజంపేటకు కాంగ్రెస్ తరపున ఆరుసార్లు ఎంపిగా గెలిచిన రికార్డు సాయిప్రతాప్
సొంతం. అటువంటి ప్రతాప్ రాష్ట్ర విభజన తర్వాత టిడిపిలో చేరారు. నిజానికి చాలాకాలం
కాంగ్రెస్ లోనే ఉన్నా రాజకీయ భవిష్యత్తు కోసమే చివరకు టిడిపిలో చేరారు. ఇపుడా
విషయంపైనే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీని వీడి తప్పు చేశానంటూ భోరు భోరుమన్నారు.
మొన్నటి ఎన్నికల్లో టిడిపి నుండి రాజంపేట పార్లమెంటు టికెట్ ఆశించారు. దక్కకపోవటంతో పార్టీకి రాజీనామా చేశారు. కొంతకాలం కామ్ గా ఉన్న సాయి చివరకు కడప కార్యాలయంలో మళ్ళీ కాంగ్రెస్ కండువాను కప్పుకున్నారు. సరే ఆ తర్వాత చాలా పెద్ద మాటలే మాట్లాడారు లేండి. చనిపోయేవరకూ కాంగ్రెస్ ను వీడనని, తాను చనిపోయిన తర్వాత కాంగ్రెస్ జెండానే కప్పాలంటూ భారీ డైలాగులే చెప్పారు.
టికెట్ దక్కక పోయేసరికి టిడిపికి రాజీనామా చేసిన సాయి కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెస్తారట. రాష్ట్రం మొత్తం మీద కాంగ్రెస్ కు దిక్కే కనిపించటం లేదు. మొన్నటి ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున ఎవరు పోటీ చేశారంటే గట్టిగా పదిమంది అభ్యర్ధుల పేర్లను కూడా చెప్పలేరు. అలాంటి పరిస్ధితుల్లో రాజంపేటలో కాంగ్రెస్ కు పూర్వ వైభవం తెస్తానని సాయి చెబితే నమ్మేదెట్లా ?