ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మరోమారు ఢిల్లీ బాట పట్టారు. ఢిల్లీ వేదికగా మరోమారు నిరసన తెలిపేందుకు ఆయన పయనమయ్యారు. చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని ఐదు బూతుల్లో రీపోలింగ్ నిర్వహించడంపై ఎన్నికల సంఘం వద్ద తన అభ్యంతరాన్ని తెలపనున్నారు. బీజేపీయేతర రాజకీయ పార్టీల నేతలతో చంద్రబాబు సమావేశం అవుతారని సమాచారం.
పోలింగ్ జరిగిన నెల తర్వాత రీపోలింగ్ నిర్వహిస్తున్నారంటూ...వైసీపీపై ఆరోపణలు గుప్పిస్తున్న టీడీపీ నేతలు ఇందులో భాగంగా చంద్రబాబు ఢిల్లీ టూర్కు స్కెచ్చేసినట్లు తెలుస్తోంది. బాబు టూర్పై టీడపీ నేతలు ఇప్పటికే హడావుడి చేయడం మొదలుపెట్టేశాయి. ``రాహుల్ గాంధీ, శరద్ పవార్, శరద్యాదవ్, ఫరూక్ అబ్దుల్లా సహా పలువురు నేతలను చంద్రబాబు కలవనున్నారు. అక్కడి నుంచి లక్నో వెళ్లి మాయావతితో భేటీ అయ్యే అవకాశం ఉంది. 23న ఫలితాల తర్వాత కార్యాచరణపై చర్చ జరగనుంది``అని ప్రకటిస్తున్నారు.
కాగా, చంద్రబాబు సహా టీడీపీ నేతల హడావుడిని వైసీపీ శ్రేణులు ఎద్దేవా చేస్తున్నాయి. ``చంద్రగిరిలో ఏడు కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని ఏప్రిల్ 12వ తేదీన వైసీపీ అభ్యర్థి ఫిర్యాదు చేశారు. దానిపై కూలంకషంగా విచారించి ఈసి ఐదు కేంద్రాలలో రీపోలింగ్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సంఘంకు అన్ని సాక్ష్యాధారాలు అందచేసిన తర్వాతనే ఈ నిర్ణయం వెలువడింది.అయినా...దీనిపై చంద్రబాబు,తెలుగుదేశం పార్టీ నానా హడావుడి చేస్తున్నారు.`` అని మండి పడుతున్నారు.