చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గం నిత్యం ఏదో వార్తతో తెరమీదకు ఎక్కుతోంది. ఇప్పటికే ఉప ఎన్నిక వల్ల చర్చనీయాంశంగా మారగా...తాజాగా ఉద్రిక్త పరిస్థితుల వల్ల మళ్లీ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. రామచంద్రాపురం మండలం ఎన్ఆర్ కమ్మపల్లిలో టీడీపీ నేతలు, వైసీపీ కార్యకర్తల మధ్య దాడి జరిగింది. అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకొని, భారీ బందోబస్తు మధ్య పోలీస్ స్టేషన్ కు తరలించారు. మరోవైపు టీడీపీ అభ్యర్థి పులివర్తి నాని కూడా ఎన్ఆర్ కమ్మపల్లి చేరుకున్నారు. అయితే, ఆయన్ను అదుపులోకి తీసుకోలేదు.
మరోవైపు చంద్రగిరి నియోజకవర్గంలోని రీపోలింగ్ జరిగే ప్రాంతాల్లో దళితులపై టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారు. తమకు వ్యతిరేకంగా ఓటు వేస్తే అంతు చూస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. టీడీపీ నేతల దౌర్జన్యంతో అక్కడి ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దళితులపై టీడీపీ చేసిన ఈ దాడిలో పలువురికి గాయాలయ్యాయి.ఎన్ఆర్ కమ్మరపల్లికి వెళ్తున్న చెవిరెడ్డి భాస్కరరెడ్డిని పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. పోలీసుల అడ్డగింతతో వేరే మార్గంలో ఎన్ఆర్ కమ్మరపల్లికి చేరుకున్నారు. టీడీపీ నేతల దాడికి నిరసనగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి రోడ్డుపై బైఠాయించారు. గాయపడ్డ దళితులను పరామర్శించడానికి వచ్చిన చెవిరెడ్డి భాస్కర రెడ్డిని రేణిగుంట పోలీస్ స్టేషన్కు తరలించారు. ఓటమి ఖాయమైందనే తెలుగుదేశం పార్టీ నేతలు దాడులకు తెగబడుతున్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. పోలీస్ స్టేషన్ వద్ద వైసీపీ కార్యకర్తలపై లాఠీ చార్జ్ చేయడం సరికాదని స్పష్టం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఓటమి భయంతో పాటుగా రీపోలింగ్ను జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డారు.