చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో రీపోలింగ్ జరపాలన్న నిర్ణయం ఏపీలో రాజకీయ వేడిని హీటెక్కిస్తోంది. అధికార ప్రతిపక్షాలు ఈ అంశంపై పరస్పరం కామెంట్లు చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీ వెళ్లి కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సునీల్ ఆరోరా సమావేశం అయ్యారు. సీఈసీతో సమావేశం అనంతరం ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ, ఈసీ అప్రజాస్వామికంగా పనిచేస్తోందని ఆరోపించారు. దీంతోపాటుగా మరిన్ని వ్యాఖ్యలు చేశారు.
అయితే, చంద్రబాబు తీరుపై వైసీపీ అధినేత జగన్ ప్రశ్నల వర్షం కురిపించారు. రీపోలింగ్ నిర్ణయాన్ని తప్పుపట్టడంపై మండిపడ్డారు. ఈమేరకు ట్వీట్ చేశారు. 'రీపోలింగ్ అప్రజాస్వామికమా? లేక రిగ్గింగా? చంద్రగిరిలో దళితుల్ని ఓటు వేయకుండా వారి ఓట్లు మీరు వేయటం అప్రజాస్వామికమా? లేక చెవిరెడ్డి మీ అరాచకాలకు అడ్డుపడటమా? రీపోలింగ్ అంటే మీకెందుకు జంకు? అని ప్రశ్నించారు. జగన్ ప్రశ్నలకు టీడీపీ, చంద్రబాబు ఏం సమాధానం చెప్తారో వేచి చూడాల్సిందే.