లగడపాటి రాజగోపాల్.. ఓ రాజకీయ నాయకుడిగా కంటే.. ఓ ఎన్నికల జాతకాలు చెప్పే పొలిటికల్ జ్యోతిష్యుడిగానే ఈయనకు ఎక్కువ పేరు. కాకపోతే మొన్నటి తెలంగాణ ఎన్నికలతో ఈయన క్రెడిబిలిటీ అంతా మట్టిగొట్టుకుపోయింది.
మళ్లీ ఇప్పుడు ఈయన తెరపైకి వస్తున్నారు. మరోసారి తన సర్వే రిపోర్టులు మీడియాకు వెల్లడించబోతున్నారు. తెలంగాణ ఎన్నికల సమయంలో వచ్చిన విమర్శలను దృష్టిలో పెట్టుకుని ఎన్నికల పోలింగ్ ముగిశాకే తన సర్వే రిపోర్టు బయటపెడతానని గతంలో లగడపాటి తెలిపారు.
కానీ ఈసారి కూడా లగడపాటి తొందపడబోతున్నారా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎన్నికల పోలింగ్ 19 తారీఖు అంటే ఆదివారంతో ముగియనుండగా.. ఆయన ఆదివారమే తన సర్వే రిపోర్టును మీడియాకు వెల్లడించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
శనివారం సాయంత్రం ఆరుగంటలకు లగడపాటి రాజగోపాల్ మీడియాతో మాట్లాడతారంటూ మీడియాకు సందేశాలు వెళ్లాయి. ఆయన కార్యదర్శి జగన్ పేరుతో ఈ మెస్సేజులు వెళ్లాయి. ఇదే నిజమైతే..లగడపాటి ముందే తన సర్వే ఫలితాలు వెల్లడిస్తారా.. లేక ఇంకేదైనా సంచలనం బయటపెడతారా అన్నది చూడాలి.