ఏపీలో హోరాహోరీగా సాగిన ఎన్నికల యొక్క ఫలితాలు తేలేందుకు మరో నాల్రోజుల సమయం మాత్రమే ఉంది. అన్ని పార్టీల్లో, విశ్లేషకుల్లో వైసీపీదే అధికారమనే అంచనాలు వెలువడుతున్నాయి. అయితే, వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఎక్కడ? కడపలో ప్రజాదర్బారు మినహా మరెక్కడా ఆయన పెద్దగా ప్రజలతో, మీడియాతో అనుసంధానం అయింది లేదు. సార్వత్రిక ఎన్నికలు గత నెల 11న పూర్త య్యాయి. పోలింగ్ రోజు రాత్రి జగన్ హైదరాబా ద్లో మీడియాతో మాట్లాడుతూ, భారీ ఎత్తున జరిగిన పోలింగ్ తమకు అనుకూలమేనని, తామే గెలవబోతున్నామని తేల్చేశారు. ఆ తరువాత రోజు నుండి జగన్ మీడియా కంట కనబడలేదు. ఇన్నా ళ్లూ జగన్ ఏం చేస్తున్నారన్నది పెద్ద ప్రశ్నగా మారింది.
వైసీపీలోని విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం, వైఎస్ జగన్ తెరవెనుక పెద్ద ఎత్తున్నే కసరత్తు చేస్తున్నారు. దాదాపుగా పధ్నాలుగు నెలలపాటు ఏపీలోని మొత్తం పదమూడు జిల్లాల్లోనూ పాదయాత్ర నిర్వహించారు. జనానికి ఏం కావాలో అవే తన ఎన్నికల ప్రణాళికలో పెట్టి అధికారంలోకి వస్తే చేసి చూపిస్తానని భరోసా ఇచ్చారు. దానికి ప్రజలు సైతం అండగా నిలిచారు. ఈ ధైర్యంతోనే ఆయన తాను ఈ సారి ఎన్నికల్లో గెలిచి తీరుతానని అంటున్నారు. అంతే నిబ్బరంగా తరువాత కార్యాచరణను కూడా సిద్ధం చేసి పెట్టుకుంటున్నారు. అధికారంలోకి వస్తే అయిదేళ్ల కాలంలో ఏం చేయాలి, ఎలా చేయాలి, దేనికి ప్రాధాన్యత ఇవ్వాలన్న దానిపై జగన్ పెద్ద కసరత్తే చేస్తున్నారు.
క్షేత్రస్థాయి నుంచి ప్రజల సమస్యల పరిష్కారానికి జగన్ ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు సమాచారం. అధికారంలోకి రాగానే గ్రామ సచివాలయ వ్యవస్థ ఏర్పాటు, అందరికీ విద్య, ఆరోగ్యం, వ్యవసాయం అనే అంశాలపై ఇచ్చిన హామీ లను అమలుచేసే క్రమంలో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు తెలిసింది. ఒక రిటైర్డు ఐఏఎస్ స్థాయి అధికారికి కొంత మంది నేతలను అప్పగించి వారితో జిల్లాల్లో తిప్పుతూ ఆ కార్యక్రమాల ద్వారా ప్రజలకు మెరుగైన లబ్ధి చేకూరాలంటే క్షేత్రస్థాయిలోఎటువంటి సమస్యలను అధిగమించాల్సి ఉంటుంది అనే అంశాలపై నివేదికలు తెప్పించుకుంటున్నారు. దీనితోపాటు మేధావులు, ఆయా రంగాల్లో నిష్ణాతులతో కూడా ఆయన తరచూ సమావేశమవుతూ ఆయా పథకాలను నూటికి నూరు శాతం అమలయ్యేలా చూడాలంటే ఏఏ జాగ్రత్తలు తీసుకోవాలి, ఎలా అమలు పర్చాలి అనే అంశంపై ఆయన మంతనాలు చేస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే మాజీ ప్రధాన కార్యదర్శి అజయ్ కల్లాం నేతృత్వంలోని ఒక బృందం గ్రామ సచివాలయ వ్యవస్థమీద జిల్లాలు తిరుగుతూ ప్రజలు, విద్యార్థులు, మేధావుల నుండి అభిప్రాయ సేకరణ చేస్తున్నట్లు తెలిసింది. అలాగే మరో ఐఏ ఎస్ అధికారి ఆధ్వర్యంలో రూ. 5 లక్షల మేర యూని వర్సల్ హెల్త్ కార్డును ప్రవేశపెట్టే అంశంపై నివేదికలు సిద్ధం చేయించుకుంటున్నారు.
స్థూలంగా ఏపీని అభివృద్ధి పథంలో నడిపించేందుకు జగన్ కృషి చేస్తున్నారు. ఇందుకోసం ముఖ్యంగా మూడు ప్రధాన రంగాలపై జగన్ దృష్టి సారించారని చెబుతున్నారు. అందరికీ విద్య, అందరికీ అవసరమైన వైద్యం, అలాగే వ్యవసాయ రంగానికి ఇంతవరకూ ఏ ప్రభుత్వం అందించనంతగా అదిపెద్ద సాయం అందించాలని యోచిస్తున్నారు. ఇలా మూడు రంగాలను తన పరిపాలన కాలంలో అద్భుతంగా తీర్చిదిద్దాలన్నది జగన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు పేర్కొంటున్నారు. ఇందుకోసం కొత్త తరహాలో ఏమేమి చేస్తే ఉన్న వ్యవస్థను బాగుచేయగలం, మరింతగా నాణ్యతతో ముందుకు తీసుకుపోగల మన్న దానిపై జగన్ అధ్యయనం చేస్తున్నారు.