నీతులు చెప్పే రాజకీయ గురివిందలకు నిజంగా చెప్పాలంటే తరుణం బాగున్నట్లు లేదు. ఇటు ఆంధ్ర ప్రదేశ్ లో నారా చంద్రబాబు నాయుడు, అటు బెంగాల్ లో మమత బెనర్జి చాలా సంక్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్నారనే చెప్పాలి.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన శారదా చిట్ఫండ్ కేసులో కొత్త మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సీనియర్ ఐపీఎస్, కోల్కతా మాజీ పోలీస్ కమిషనర్ రాజీవ్ కుమార్ కు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.
కేసు దర్యాప్తులో భాగంగా రాజీవ్ కుమార్ను కస్టడీ లోకి తీసుకునేందుకు సీబీఐ దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీంకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. ఆయన అరెస్ట్ పై ఉన్న స్టేను ఎత్తివేస్తూ, రాజీవ్ ను విచారించేందుకు అత్యున్నత న్యాయస్ధానం సీబీఐకి గ్రీన్సిగ్నల్ ఇచ్చింది.
ఒకవేళ ఆయన విచారణకు సహకరించక పోతే రాజీవ్ను అరెస్ట్ చేయవచ్చని సీబీఐకి సూచించింది. అయితే ముందస్తు బెయిల్ కోసం రాజీవ్ కుమార్ వారం లోపు పిటిషన్ దాఖలు చేసు కోవచ్చని సుప్రీంకోర్టు తెలిపింది.
శారదా చిట్ ఫండ్ కేసులో రాజీవ్ ను విచారించేందుకు వచ్చిన సీబీఐ బృందాన్ని మమత ప్రభుత్వం అడ్డుకొని సుప్రీం కోర్ట్ తో చివాట్లు తిన్న సంగతి తెలిసిందే. శారదా గ్రూప్ పేరుతో 200 ప్రైవేట్ కంపెనీల నడిపిన పొంజీ స్కీం దివాళా తీయడంతో బెంగాల్ తో పాటు చుట్టు పక్కల రాష్ట్రాల్లోని 17000000 మంది డిపాజిటర్లు రోడ్డు మీద పడ్డారు.