కౌంటింగ్ తేదీ సమీపిస్తున్న కొద్ది...ఏపీ రాజకీయాలు మరింత హాట్గా మారుతున్నాయి. తెలుగుదేశం పార్టీ తన అధికార బలం అండతో చేసే చర్యలపై వైసీపీ ముందు నుంచే జాగ్రత్త వహిస్తోంది. ఈ మేరకు టీడీపీ ఎత్తుగడలకు ముందే బ్రేకులు వేసింది. కేంద్ర ఎన్నికల కమిషన్ను వైసీపీ ఎంపీలు, మాజీ ఎంపీల బృందం కలిసి ఈ మేరకు ఫిర్యాదు చేసింది. ఎంపీలు విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, బుట్టా రేణుక, పండుల రవీంద్ర బాబు, అవంతి శ్రీనివాస్, మేకపాటి రాజమోహన్ రెడ్డి, సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లుతో కూడిన బృందం ఈ మేరకు కౌంటింగ్ ప్రక్రియ, స్వేచ్ఛగా పారదర్శకంగా జరిగేందుకు చర్యలు తీసుకోవాలని కోరింది.
కౌంటింగ్ ప్రక్రియకు ఆటంకం కలిగించేందుకు టీడీపీ ప్రయత్నించే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో సమస్యాత్మక నియోజకవర్గాల్లో అదనపు పోలీసు బలగాలను బయటి రాష్ట్రాల నుంచి నియమించాలని వైసీపీ బృందం విజ్ఞప్తి చేసింది. “మాక్ పోలింగ్”లో ఉపయోగించిన వీవీ ప్యా ట్ స్లిప్పులు తొలగించని పక్షంలో ఓట్ల లెక్కింపులో తేడా వచ్చే అవకాశం ఉందని, దీనిపై తగిన మార్గదర్శకాలను ఎన్నికల సంఘం వెలువరించాలని విజ్ఞప్తి చేసింది.
చంద్రగిరి అసెంబ్లీ నియోజకవర్గంలో రీపోలింగ్ కట్టుదిట్టమైన చర్యల మధ్య పారదర్శకంగా జరపాలని వైసీపీ నేతలు కోరారు. రాప్తాడు రిటర్నింగ్ ఆఫీసర్ను మార్చాలని విన్నవించారు. చంద్రగిరి- ఉరవకొండ-మంగళగిరి-రాప్తాడు- దెందులూరు-ధర్మవరం-తాడిపత్రి- గాజువాక-రాజంపేట - గురజాల-చిలకలూరిపేట-వైజాగ్ ఈస్ట్-గుడివాడ-మైలవరం-గన్నవరం- తుని-భీమవరం తదితర అసెంబ్లీ నియోజకవర్గాల్లో టీడీపీ ఉద్దేశపూర్వకంగా గొడవ సృష్టించేందుకు కుట్ర పన్నుతోందని ఆరోపించారు.