ఏపీలో ప్రభుత్వం టీడీపీదా?.. వైసీపీదా? అన్న అంశంపై దాదాపు నెల రోజులుగా తీవ్ర ఉత్కంఠ నెలకొన్న ఎన్నికల ఫలితాలపై ఎగ్జిట్పోల్స్ ఫలితాలు వచ్చేశాయి. ఈ ఎగ్జిట్ పోల్స్పై దేశవ్యాప్త సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏప్రిల్ 11 నుంచి సుదీర్ఘంగా కొనసాగుతూ వచ్చిన పోలింగ్ ప్రక్రియ దేశవ్యాప్తంగా ఆదివారంతో ముగిసింది. దీంతో ఆదివారం సాయంత్రం నుంచి ఎగ్జిట్పోల్స్ మోత మోగిపోతోంది. ఏపీలో ఎవరు గెలుస్తారు ? అనే అంశంపై ప్రముఖ నేషనల్ మ్యాగజైన్ ఇండియాటుడే సర్వేలో ఏపీలో వైసీపీ అధికారంలోకి వస్తుందని చెప్పింది.
తొలిసారిగా ఒంటరిగా బరిలోకి దిగిన టీడీపీకి అధికార వియోగం తప్పదని సర్వేలు తేల్చేశాయి. ఇక పవన్కళ్యాణ్ ఆధ్వర్యంలోని జనసేన పెద్దగా ప్రభావం చూపదని పలు సర్వేల సంస్థలు తేల్చేశాయి. లోక్సభ ఎన్నికల్లో వైసీపీకి 18 నుంచి 20 సీట్లు వస్తాయని ఇండియా టుడే- మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. టీడీపీకి 4 నుంచి 6 సీట్లు రావొచ్చని తెలిపింది. ఇక సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్(సీపీఎస్) వైసీపీకి 130 నుంచి 133 వరకు సీట్లు వస్తాయని చెప్పింది.ఈ సర్వే టీడీపీకి 43 నుంచి 44 స్థానాలు దక్కే అవకాశముందని పేర్కొంది. జనసేన పార్టీకి సున్నా నుంచి ఒక స్థానం రావొచ్చని తెలిపింది.
ఇక పీపుల్స్ సర్వేలో వైసీపీకి 112, టీడీపీ 59, జనసేనకు 4 అసెంబ్లీ స్థానాలు వస్తాయని వెల్లడించింది. వైసీపీకి 18 నుంచి 21 లోక్సభ స్థానాలు గెల్చుకునే అవకాశముందని తెలిపింది. టీడీపీకి 4 నుంచి 6 సీట్లు దక్కనున్నాయని అంచనా కట్టింది. జనసేనకు ఒక స్థానం రావొచ్చని తేల్చింది.