ఏపీలో జరిగిన లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లో ప్రతిపక్ష వైసీపీ ఘనవిజయం సాధించడం ఖాయమని సెంటర్ ఫర్ సెఫాలజీ స్టడీస్ (సీపీఎస్) పోస్ట్ పోల్ సర్వే అంచనా వేసింది. ఏపీలో 175 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్.జగన్ నేతృత్వంలోనే వైసీపీ 130-133 స్థానాలు దక్కించుకుంటుందని చెప్పింది. ఇక టీడీపీ కేవలం 43-44 స్థానాలకు పరిమితమవుతుందని సీపీఎస్ ఎగ్జిట్ పోల్ చెప్పింది. ఇక పవన్కళ్యాణ్ నేతృత్వంలోని జనసేన పార్టీ సున్నా లేదా ఒక్క స్థానం గెలిచే అవకాశముందని, ఐదు స్థానాల్లో హోరాహోరీ పోటీ నెలకొని ఉంటుందని పేర్కొంది.
ఇక ఓట్ల శాతం విషయానికి వస్తే వైసీపీకి 50.1% శాతం ఓట్లు వస్తాయని, టీడీపీకి 40.2% శాతం ఓట్లు, జనసేనకు 7.3% శాతం ఓట్లు, ఇతరులకు 2.6% శాతం ఓట్లు వస్తాయని సీపీఎస్ వెల్లడించింది. ఇక ఇదే క్రమంలో తమ సంస్థ 2006 నుంచి ప్రీ పోల్స్ నిర్వహిస్తోందని... 2009లో సమైక్య రాష్ట్రంలో ఏపీ ఎన్నికలపై నిర్వహించిన సర్వేలోనూ తాము చెప్పినట్టు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని.. చాలా ఖచ్చితమైన ఫలితాలు తమ సంస్థ అందించిందన్న విషయం గుర్తు చేసింది.
ఇటీవల జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 88 నుంచి 90 స్థానాలు వస్తాయని తాము అంచనా వేశామని, తమ అంచనా నిజమై టీఆర్ఎస్కు 88 స్థానాలు వచ్చాయని, అదేవిధంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్కు 98 నుంచి 100 స్థానాలు వస్తాయని తాము పేర్కొనగా.. ఆ పార్టీకి 99 స్థానాలు వచ్చాయని తెలిపింది. 2009లో వైఎస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీకి 159 సీట్లు వస్తాయని చెపితే అప్పుడు 156 సీట్లతో వైఎస్సార్ రెండో సారి అధికారంలోకి వచ్చిందని చెప్పింది.