దేశవ్యాప్తంగా ఏడు దశల్లో ఎన్నికల పోలింగ్ పూర్తయిన సంగతి తెలిసిందే. దీంతో సర్వత్రా ఆసక్తిగా ఎదురుచూసిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఆదివారం సాయంత్రం వెల్లడయ్యాయి. అసెంబ్లీ, లోక్సభ స్థానాల్లో వైసీపీ విజయ దుందుభి మోగించడం ఖాయమని జాతీయ ఛానెళ్ల ఎగ్జిట్ పోల్స్ ప్రకటించాయి. లోక్సభ ఎన్నికల్లో వైసీపీకి 18 నుంచి 20 సీట్లు వస్తాయని ఇండియా టుడే- మై యాక్సిస్ ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది. టీడీపీకి 4 నుంచి 6 సీట్లు రావొచ్చని తెలిపింది. ఏపీలో వైసీపీకి 18 సీట్లు గెలవబోతుందని ఇండియా టీవీ- సీఎన్ఎక్స్ ఎగ్జిట్ పోల్ స్పష్టం చేసింది. వైసీపీకి 18, టీడీపీకి 07 లోక్ సభ స్థానాల్లో గెలుస్తుందని ఈటీ నౌ తెలిపింది. 13 నుంచి 14 లోక్ సభ స్థానాల్లో వైసీపీ విజయం సాధిస్తుందని న్యూస్-18 ఎగ్జిట్ పోల్ అంచనా వేసింది.
అయితే, దీనిపై టీడీపీ స్పందన ఏంటి? అన్ని సర్వేల్లోనూ వైసీపీ ప్రభంజనం నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ నేతలు ఏ విధంగా స్పందించాలో తెలియని రీతిలో మీడియాకు మొహం చాటేశారని అంటున్నారు. వివిధ మీడియా ఛానల్లలో హుషారుగా మాట్లాడే నేతలు...పెద్దగా స్పందించకుండా గమ్మున ఉండక తప్పలేదని పలువురు పేర్కొంటున్నారు. దీంతో, ఎగ్జిట్ పోల్స్ గందరగోళంగా మారాయని పేర్కొంటున్నట్లు తెలుస్తోంది. వైసీపీ అత్యధిక లోక్ సభ స్థానాలను గెలుస్తుందని జాతీయ ఛానెల్స్ ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. కానీ ఐఎన్ఎస్ఎస్, టుడేస్ చాణుక్య, సీఓటర్, లగడపాటి ఎగ్జిట్ పోల్స్ మాత్రం తెలుగుదేశం పార్టీ ఎక్కువ స్థానాలను కైవసం చేసుకుంటుందని తేల్చాయి.