ఏపీ ఎన్నికల ఫలితాలు ఎలా ఉండబోతున్నాయో ? అన్న దానిపై ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతో ఇప్పటికే ఓ క్లారిటీ వచ్చేసింది. గురువారం తుది ఫలితాలు వెల్లడి అయ్యాక తెలుగుదేశం పార్టీనీ భవిష్యత్తుపై లెక్కకు మిక్కిలిగా సందేహాలు వెలువడతాయి. చంద్రబాబుకు ఇప్పటికే వయసు పైబడటంతో తెలుగుదేశం పార్టీనీ సహజంగానే ఆయన కుమారుడు నారా లోకేష్ కు అప్పగిస్తారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో లోకేష్ తెలుగుదేశం పార్టీని నడిపించగలరా ? అంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు లోకేష్ నాయకత్వ పటిమపై సవాలక్ష సందేహాలు ఉన్నాయి. ఈ ఎన్నికల ఫలితాల తర్వాత టిడిపిలో ఒకప్పుడు బెటర్ అనిపించుకున్న వెటరన్ బ్యాచ్ పొలిటికల్ కెరియర్కు శుభం కార్డు పడిపోతుంది. చంద్రబాబు గత దశాబ్ద కాలం నుంచే ఈ వెటరన్ బ్యాచ్ను వదిలించుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ఎన్నికలతో వీరు ఇక ఇంటికే పరిమితం కానున్నారు.
తాజా స్పీకర్ కోడెల శివప్రసాద్ రావును వదిలించుకొనేందుకు చంద్రబాబు ఈ ఎన్నికల్లో చాలా ప్రయత్నాలు చేశారు. నువ్వు పోటీ నుంచి తప్పుకుంటే రాజ్యసభకు పంపిస్తాం అని ఆఫర్ కూడా ఇచ్చారు. ఆయన మాత్రం తిరిగి తాను అసెంబ్లీకే పోటీ చేస్తానని చెప్పడంతో... చివరకు ఆయనకు ఓడిపోతారని తెలిసినా కూడా సత్తెనపల్లి సీటు ఇవ్వక తప్పలేదు. కరణం బలరాంను ఎలా ? వదిలించుకోవాలా అని బాబు ఆలోచిస్తున్న టైంలో ఆమంచి కృష్ణమోహన్ వైసీపీలోకి వెళ్లిపోవడంతో అద్దంకిలో గొట్టిపాటికి ఇబ్బంది లేకుండా ఉంటుందని బాబు బలరాంను చీరాలకు తోసేశారు. చీరాలలో బలరాం ఓటమి ఖాయం అవడంతో ఆయన పొలిటికల్ కెరియర్ కు శుభం కార్డు పడనుంది. ఇప్పటికే నాలుగు సార్లు ఓడిన మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఓటమితో రాజకీయాలకు దూరమయ్యే పరిస్థితి వచ్చేసింది. సర్వేపల్లిలో సోమిరెడ్డి ఏ మాత్రం గెలిచే పరిస్థితి లేదని తెలుస్తోంది. నాలుగైదు ఎన్నికల్లో సోమిరెడ్డిని బలవంతంగా సాకుతూ వస్తున్న చంద్రబాబుకు ఈ ఎన్నికల తర్వాత ఆ పరిస్థితి ఉండదు.
యనమల రామకృష్ణుడు, చింతకాయల అయ్యన్నపాత్రుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి లాంటి సీనియర్ల పరిస్థితి ఎన్నికల ఫలితాల తర్వాత అగమ్యగోచరమే. చాలా గౌరవంగా రాజకీయాల నుంచి తప్పుకోవాలనుకున్న ఈ సీనియర్లు ఘోర పరాజయంతో తమ పొలిటికల్ కెరియర్ కు శుభం కార్డు వేసుకునే పరిస్థితి చంద్రబాబు కల్పించారు. వీరిలో చాలా మందికి ఈ ఎన్నికల్లో సీటు ఇచ్చేందుకు చంద్రబాబు ఇష్టపడలేదు. వారంతా చంద్రబాబుని బెదిరించి మరి తెచ్చుకున్నారు. ఎన్నికల్లో ఓటమి తర్వాత చంద్రబాబు సైతం రాజకీయాల్లో చేయటానికి ఏం లేదు. పార్టీ పగ్గాలు లోకేష్ కు అప్పగించినా పార్టీని ఎంతవరకు ముందుకు తీసుకువెళ్తాడు అన్నది క్లారిటీ లేదు. మళ్లీ ఐదేళ్ల తర్వాత వచ్చే ఎన్నికలకు చంద్రబాబు పరిస్థితి ఏంటన్నది చూడాలి. అదే టైమ్లో కేంద్రంలో మరో సారి మోడీ ప్రధాన మంత్రి అయితే ఏపీలో టీడీపీకి చుక్కలు చూపించేస్తాడనడంలో సందేహం లేదు. ఇప్పటికే బెంగాల్, ఒడిశా ఆపరేషన్లు సక్సెస్ చేసిన బీజేపీ నెక్ట్స్ టార్గెట్ తెలంగాణ, ఏపీ, తమిళనాడు మీదే ఉంది. ఐదేళ్ల తర్వాత ఏపీలో టీడీపీ తరపున పోటీ చేసేందుకు సరైన అభ్యర్థులు దొరకని గడ్డు పరిస్థితి ఎదురైనా ?ఆశ్చర్యపోనవసరం లేదు.