దేశవ్యాప్తంగా సార్వత్రిక పోరు ముగియడంతో ఫలితాల అంచనాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఆదివారం సాయంత్రం వెలువడిన ఎగ్జిట్పోల్స్ రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించాయి. ఆంధ్రప్రదేశ్లో ఈసారి లోక్సభ, అసెంబ్లీ రెండింటిలోనూ వైసీపీదే హవా అని అత్యధిక సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పగ్గాలు చేపట్టనున్నారని చెబుతున్నాయి. మరోవైపు ఢిల్లీలో ఎన్డీఏదే అధికారమి నొక్కివక్కాణించాయి. అయితే, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ పోల్స్పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, లోక్సభ ఎన్నికలకు సంబంధించి ఆదివారం సాయంత్రం వెల్లడైన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు exact పోల్స్ (కచ్చితమైనవి) కావని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోవాలని అన్నారు. 1999 నుంచి అనేకసార్లు ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రతి పార్టీ కూడా విజయం తమదే అని ధీమా వ్యక్తం చేస్తుంది కాబట్టి, మే 23 వరకు వేచి ఉండడం మంచిదని సూచించారు. ఈ దేశం సమర్థవంతమైన నాయకుడిని, సుస్థిర ప్రభుత్వాన్ని కోరుకుంటున్నదని పేర్కొన్నారు.
ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాటల నేపథ్యంలో...తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్ విషయంలో ఆ పార్టీ నేతలు ఉపశమనంగా భావించాలా అంటూ పలువురు చర్చించుకుంటున్నారు. మరోవైపు, ఎన్డీఏదే అధికారమని తేల్చిన నేపథ్యంలో మోడీకి షాక్గా భావించాలా అంటూ కొందరు కొత్త విశ్లేషణ చేస్తున్నారు.