నేను ముఖ్యమంత్రి కాకుండా ఎవరూ అడ్డుకోలేరు అంటూ....సంచలన వ్యాఖ్యలు జనసేన అధినేత, సినీనటుడు చేసిన సంగతి తెలిసిందే. హోరాహోరీగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో పవన్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఈ సందర్భంగానే ఆయన జనసేనను బలోపేతం చేసేందుకు శ్రమించారు.ఈ సందర్భంగానే అధికారం విషయంలో తన మనసులోని మాటను బయటపెట్టారు. తను సీఎం కాకుండా ఎవరూ అడ్డుకోలేరని ప్రకటించారు. అయితే, తాజాగా విడుదలైన ఎగ్జిట్ పోల్స్ విషయంలో పవన్ కళ్యాణ్ స్పందన ఆసక్తికరంగా మారింది.
పోలింగ్ అనంతరమే జనసేన ఊహించిన స్థాయిలో జనసేన సీట్లు సాధించలేదనే విషయం పలువురు అంచనా వేశారు. తాజాగా ఎగ్జిట్పోల్స్ ద్వారా ఇదే విషయం స్పష్టమైంది. జాతీయ స్థాయిలో వలే ఆంధ్రప్రదేశ్లో శాసనసభ, లోక్సభ ఎన్నికల సంబంధిం చిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను కూడా ప్రకటించాయి. జాతీయ ఛానెళ్లతో పాటు, ఆంధ్ర ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్, ఇతర సర్వే సంస్థలు ఏపీలో ఏ పార్టీకి ఎన్ని సీట్లు అనే విషయంలో తలో లెక్కలు వేశాయి. కొన్ని సంస్థలు ఏపీలో మళ్లీ టీడీపీయే అధికారంలోకి వస్తుందని తేల్చగా.. మరికొన్ని సంస్థలు ఈసారి వైసీపీకే ఆంధ్ర ఓటర్లు పట్టం కట్టబోతున్నారని ప్రకటించాయి. అయితే, జనసేన ఎంట్రీతో పరిస్థితి మారుతుందని అంచనా వేసినా..! రాష్ట్రంలో హంగ్కి అవకాశం ఉన్నట్టు ఏ సంస్థా పేర్కొనలేదు.
ఇటు టీడీపీకి అనుకూలంగా చెప్పిన సంస్థలుగానీ, అటు వైసీపీకి అనుకూలంగా ఫలితాలు ఉంటాయన్న సంస్థలుగానీ పూర్తిస్థాయి మెజార్టీనే కట్టబెట్టాయి. ఎగ్జిట్స్ పోల్స్ని బట్టి చూస్తే పవన్ కల్యాణ్... జనసేన పార్టీకి స్వల్ప సంఖ్యలో సీట్లే దక్కుతాయని అర్ధమవుతోంది. త్రిముఖ పోరులో జనసేన పార్టీ భారీగా ఓట్లు పొందండంతో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఏ పార్టీ విజయావకాశాల్ని దెబ్బతీసిందన్న విషయం ఏ ఎగ్జిట్ పోల్స్ చెప్పలేదు. ఇలా జనసేనత సత్తాను చాలా తక్కువగా అంచనా వేసినప్పటికీ జనసేన తరఫున ఇటు పవన్ కళ్యాణ్ కానీ పార్టీ నేతలు స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది.