ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు వేశారు. వరుస ట్వీట్లలో ఆయన చంద్రబాబు తీరును ఎద్దేవా చేశారు. ``సొంత రాష్ట్రంలో గెలిచే సీన్ లేక ఢిల్లీ, లక్నోలలో తిరుగుతున్నాడు. ఎన్డీఏ యేతర పార్టీలు అస్థిత్వ సమస్యను ఎదుర్కొంటుంటే ఐక్యత చర్చలంట. నేతలంతా ఏడో దశ ఎన్నికల్లో తీరిక లేకుండా ఉంటే చంద్రబాబు వెళ్లి మాయావతి, అఖిలేశ్ యాదవ్, రాహుల్ గాంధీ, శరద్ పవార్లను ఫోటో సెషన్ల కోసం హింస పెడుతున్నాడట. `` అంటూ కామెంట్ చేశారు.
``యూపీఏ, మాయావతి-అఖిలేశ్ ఫ్రంటులు చతికల పడ్డాయి. చంద్రబాబు గ్రాఫ్ ఢమాల్ అన్న విషయం కూడా వాళ్లకి అర్థమైంది. లగడపాటి సర్వేను అందరికీ చూపించబోగా విసుక్కున్నారట. పాపం అటు ఇటు కాకుండా పోయాడు బాబు. ఢిల్లీలో చంద్రబాబును అందరూ ‘ఫెవికాల్ బాబా’ అని పిలుస్తున్నారు. పిలవని పేరంటంలా అందరి ఇళ్లపై పడి ఫోటోలు దిగుతూ, వాళ్లను కలుపుతా వీళ్లను ఏకం చేస్తా అంటుంటే ఈ నిక్ నేమ్ తగిలించారట. ఎవరి టెన్షన్లలో వాళ్లుంటే సమయం, సందర్భం లేకుండా ఈ ఫెవికాల్ రాయబారాలేమిటని జోకులేసుకుంటున్నారట. `` అని వ్యాఖ్యానించారు.
``పొరుగు రాష్ట్రం తెలంగాణ ఆంధ్రప్రదేశ్ వినాశనాన్ని కోరుకుంటుందని బోరున విలపించిన బాబు ఇప్పుడు చేస్తున్నదేమిటో? తెలుగు ప్రజల ఆత్మగౌరవం నినాదంతో పుట్టిన తెలుగుదేశం పార్టీని సోనియా గాంధీ, ఉత్తరాది నేతల పాదాల ముందు పడేశాడు. ఎప్పుడు కలవాలో ఎప్పుడు విడిపోవాలో ఈయనకంటే వాళ్లకు బాగా తెలుసు.``అంటూ ట్వీట్ చేశారు. ``ప్రజలు ఓటుకు 2 వేలు డిమాండు చేస్తున్నారని చంద్రబాబు శోక సముద్రమయ్యాడు. అసలా సంస్కృతికి పితామహుడివే నువ్వు కదా బాబూ. ఎమ్మెల్యేలను సంతలో పశువుల్లా కొనే సంప్రదాయం మొదలు పెట్టిందెవరు? ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడిన తర్వాత కూడా నీతిమాలిన పనులకు తెగబడ్డావు.`` అని మండిపడ్డారు.