ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరు దేశ రాజకీయాలతో పాటు ఏపీ రాజకీయాల గురించే మాట్లాడుకుంటున్నారు. ఏపీకి పొరుగు రాష్ట్రమైన తెలంగాణలోనూ లోక్సభ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల గురించి ఎవ్వరూ మాట్లాడుకోవడం లేదు. దీనికి కారణం తెలంగాణలో అంతా టీఆర్ఎస్ ప్రభంజనమే నడుస్తుందని స్పష్టంగా తేలిపోయింది. ఎగ్జిట్పోల్స్ కూడా టీఆర్ఎస్కు తిరుగులేని చెప్పేశాయి. కేసీఆర్ మాత్రం ఎన్నికలకు ముందు నుంచే హైదరాబాద్ సీటు ఎంఐఎంకు వదిలేసి... మిగిలిన 16 సీట్లలోనూ గులాబీ జెండాయే రెపరెపలాడాలని ప్లానింగ్ వేసి దూసుకుపోయారు.
కేసీఆర్ మిషన్ 16 సీట్లు లక్ష్యంతోనే ఈ లోక్సభ ఎన్నికలు ఎదుర్కొన్నారు. ఇక ఎగ్జిట్పోల్స్ ఫలితాల్లో మాత్రం టీఆర్ఎస్కు 14 సీట్లు వస్తాయని అంటున్నారు. అన్ని ఎగ్జిట్పోల్స్ రెండు సీట్లు ప్లస్ ఆర్ మైనస్లో ఉంటాయని చెప్పాయి. మరి టీఆర్ఎస్ ఓడే ఆ రెండు సీట్లు ఏవి ? అన్నది పరిశీలిస్తే కాంగ్రెస్ కొన్ని సీట్లలో గట్టి పోటీ ఇచ్చింది. ఆ సీట్లలో ఒకటి లేదా రెండు చోట్ల గెలిచే స్కోప్ కనపడుతోంది. కాంగ్రెస్కు మంచి ఛాన్స్ ఉన్న నియోజకవర్గాల్లో కొండా విశ్వేశ్వర్రెడ్డి పోటీ చేసిన చేవెళ్ల నియోజకవర్గం ఒకటి.
చేవెళ్లలో ఆయనకు పార్టీలతో సంబంధం లేకుండా సొంత ఇమేజ్ కూడా ఉంది. ఇదే రేపటి ఎన్నికల్లో కలిసి రానుంది. రూ. 890 కోట్ల అధిపతి అయిన కొండా ఇక్కడ గెలుపు కోసం చేయాల్సిందంతా చేశాడట.. ఇక మల్కాజిగిరిలో గెలుపుపై రేవంత్ కూడా ధీమాగా ఉన్నాడు. రేవంత్కు గత ఎన్నికల్లో ఓడిన సానుభూతి, ఈ సారి ఎలాగైనా రేవంత్ను గెలిపించుకోవాలన్న కసి ఆయనకు ప్లస్ అయ్యాయి. ఇక భువనగరిలో కోమటిరెడ్డి చివర్లో అయినా స్వల్ప మెజార్టీతో గెలవవచ్చంటున్నారు. ఇక బీజేపీ సికింద్రాబాద్పై ఆశలు పెట్టుకుంది. తెలంగాణలో ఆ పార్టీ గెలిచే సీట్లలో ఇదే ఫస్ట్ అంటున్నారు. కిషన్కు కేంద్రంలో మంత్రి పదవి ఖాయమన్న ప్రచారం కూడా ఊపందుకుంది.
ఇక కరీంనగర్, మహబూబ్నగర్ నియోజకవర్గాల్లో కూడా బీజేపీ ఆశలు పెట్టుకుంది. కరీంనగర్లో ఆ పార్టీ నుంచి పోటీ చేసిన బండి సంజయ్ టీఆర్ఎస్కు షాక్ ఇస్తాడని అంటున్నా ఆయన గెలిచే పరిస్థితి కష్టంగానే ఉంది. ఇక మహబూబ్నగర్, నిజామాబాద్ లాంటి చోట్ల బీజేపీ రెండో ప్లేస్లో ఉందని అంటున్నారు. మొత్తంగా కాంగ్రెస్ రెండు - బీజేపీ 1 సీటు అయినా గెలుచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఎంఐఎం హైదరాబాద్లో గెలిస్తే టీఆర్ఎస్ 13 సీట్లకు కూడా పరిమితమవుతుంది. అదే జరిగితే అక్కడ విపక్షాలు పెద్ద విజయం సాధించినట్లే.