ఏపీ విపక్షనేత వైఎస్ జగన్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తమ పార్టీ తరపున పోటీ చేసిన అభ్యర్థులతో తలపెట్టిన భేటీని ఆయన అనూహ్యంగా రద్దు చేసుకున్నారు. మంగళవారం తాడేపల్లి నివాసంలో జగన్ పార్టీ అభ్యర్థులతో భేటీ అవుతారని, ఓట్ల లెక్కింపు సందర్భంగా తీసుకోవలసిన జాగ్రత్తలను సూచిస్తారని వైసీపీ పార్టీ వర్గాలు మొదట తెలిపాయి.
కానీ ఇప్పుడు జగన్ తన నిర్ణయం మార్చుకున్నారు. ఈ భేటీని రద్దు చేసుకున్నారు. అయితే ఇందుకు కారణాలు తెలియరాలేదు. పార్టీ అంతర్గత వర్గాలు మాత్రం ఎగ్జిట్ పోల్ సర్వేల ఫలితాల నేపథ్యంలో ఈ భేటీని రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది.
దీనికి బదులుగా జగన్.. ఎన్నికల ఫలితాల తీరును గుంటూరు జిల్లా తాడేపల్లిలోని తన నివాసం నుంచి సమీక్షించాలని నిర్ణయించారట. ఆదివారం ఎగ్జిట్పోల్ ఫలితాలు వెలువడిన తర్వాత తన షెడ్యూల్ మార్చుకున్నారని తెలుస్తోంది.
మరి ఇది ఎలాగూ గెలవబోతున్నాం కదా.. ఇంకా ఎందుకు ఈ భేటీ అని జగన్ రద్దు చేసుకున్నారా.. లేక.. వేరే ఏదైనా కారణం ఉందా అన్నదానిపై ఊహాగానాలు వస్తున్నాయి. హైదరాబాద్ నుంచి బుధవారం తాడేపల్లి నివాసానికి చేరుకుని పార్టీ ముఖ్య నేతలతో సమావేశం అవుతారట జగన్. ఫలితాలు రెండు రోజుల్లో రానున్న నేపథ్యంలో నాయకుల ప్రతి చర్య కూడా ఉత్కంఠ కలిగిస్తోంది.