తెలుగు జర్నలిజం ఎలా బ్రష్టుపట్టిపోయిందో ? గత దశాబ్దకాలంగా చూస్తూనే ఉన్నాం. ఓ సగటు పౌరుడికి సైతం తెలుగు మీడియాపై ఎంత మాత్రం నమ్మకం లేదంటే మన మీడియా ఎంత దిగజారిపోయిందో ? అర్థం అవుతోంది. తెలుగు జర్నలిజం ప్రమాణాలు నాటికి పూర్తిగా తీసికట్టుగా ఉంటున్నాయి. ఇదిలా ఉంటే నాసిరకం ప్రమాణాలతో పతనావస్థలో ఉన్న తెలుగు జర్నలిజం ఈ నెల 23న ఎన్నికల ఫలితాల తర్వాత చాలా వరకు పతనం అయిపోనుంది. ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగు మీడియాలో కొన్ని ప్రముఖ దిన పత్రికలు, న్యూస్ ఛానల్స్ కొనసాగడంపై మీడియా వర్గాల్లో అనేక సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్నికల ఫలితాలు రాకుండానే తెలంగాణకు విజయక్రాంతి పత్రిక అప్పుడే మూసేశారు.
కోమటిరెడ్డి సోదరులు నడిపిన రాజ్ న్యూస్ ఛానల్ కూడా మూసి వేయడం లేదా ఎవరో ఒకరు టేకోవర్ చేయడం జరుగుతుందని తెలుస్తోంది. ఇక మొన్నటి వరకు సిపిఐ ఆధ్వర్యంలో ఉన్న 99 న్యూస్ ఛానల్ ఇప్పుడు టేకోవర్ చేసిన జనసేన కూడా 99 న్యూస్ ఛానల్ ను వదిలించుకొనుందట. ఇక సూర్య, వార్త లాంటి పత్రికలు కూడా ఉంచాలా ? మూసి వేయాలా ? అన్న ఊగిసలాట ధోరణితో ఉన్నట్టు తెలుస్తోంది. ఇక జనసేన కోసం ఎన్నికల ముందు ప్రారంభమైన ఓ ఎన్నారై ఛానల్ కూడా ఫలితాలు వచ్చిన వెంటనే మూసివేస్తారని ప్రచారం జనసేన వర్గాల్లో జోరుగా నడుస్తోంది. మహాన్యూస్, హెచ్ఎంటీవీ, ఐ న్యూస్ ఛానల్ పరిస్థితి కూడా ఏమంత ఆశాజనకంగా లేదని అంటున్నారు.
మరీ ముఖ్యంగా తెలంగాణలో దినపత్రికలు కొనసాగడంపై చాలా సందేహాలు ఉన్నాయి. ఉభయ కమ్యూనిస్టు పార్టీలు గతంలో ప్రజాశక్తి, విశాలాంధ్ర పత్రికలను విజయవంతంగా రన్ చేశాయి. రాష్ట్రం విడిపోయాక వీటి స్థానాల్లో తెలంగాణలో వచ్చిన నవ తెలంగాణ, మన తెలంగాణ పత్రికలు కూడా కొట్టుమిట్టాడుతున్నాయట. ఏదేమైనా తెలుగు మీడియా రంగంలో స్థానిక పత్రికలు, యూట్యూబ్ ఛానల్స్, వెబ్సైట్లు పుట్టగొడుగుల పుట్టుకురావడంతో పాటు సోషల్ మీడియా ప్రభావం పెరిగిపోవడంతో మీడియా రంగం హవా తగ్గిపోతూ వస్తోంది. మరి ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగు మీడియాలో ఏ ఏ పత్రికలు ఏ ఏ న్యూస్ ఛానల్స్ ఉంటాయో, మూతపడతాయో ? చూడాలి.