కరీంనగర్ నగరపాలక సంస్థ కీలక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పురపాలక సంస్థ ఆధ్వర్యంలో రూపాయికే అంత్యక్రియలు చేపట్టాలని నిర్ణయించినట్టు నగర మేయర్ రవీందర్సింగ్ పేర్కొన్నారు. సోమవారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రూ.1 కే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అన్ని సదుపాయాలతో ఈ చివరి గడియల కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు.
అంత్యక్రియలను చేపట్టేందుకు నగరపాలక సంస్థ రూ. 1.50 కోట్లు కేటాయించిందనీ...ఇందుకోసం ప్రత్యేకంగా వాహనాలు, ఫ్రీజర్, ఇతర సామగ్రి కొనుగోలు చేస్తున్నామని మేయర్ చెప్పారు. జూన్ 15 నుంచి కార్యక్రమాన్ని అమల్లోకి తెస్తామన్నారు. ఇంటి వద్ద నుంచి శ్మశానవాటిక వరకు వాహనం, దహన సంస్కారాలకు సంబంధించి అన్ని ఏర్పాట్లను బల్దియానే చేపడుతుందని చెప్పారు. వీటితోపాటు కర్మకాండలకు సంబంధించిన విషయంలో తీసుకోవాల్సిన వాటిపై చర్చిస్తున్నామన్నారు. అన్నివర్గాల ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.