ఎగ్జిట్పోల్స్ అంచనాల నేపథ్యంలో ఢిల్లీ రాజకీయం మారుతోంది. ఎగ్జిట్ పోల్స్తో నిమిత్తం లేకుండా లోక్సభ ఎన్నికల ఫలితాలు రెండు రోజుల్లో వెలువడనుండగా ప్రధాన ప్రతిపక్ష పార్టీల నేతలు మంగళవారం ఢిల్లీలో సమావేశం కానున్నారు. ప్రస్తుత దేశ రాజకీయాలు, ఎన్డీఏయేతర ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి గల అవకాశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. మరోవైపు ఫలితాల్లో హంగ్వస్తే ప్రభుత్వ ఏర్పాటుకు కలిసి వచ్చే అవకాశాలపై ఢిల్లీలో విపక్షాలు మంగళవారం మేధోమథనం నిర్వహించనున్నాయి.
అయితే, ఇదే సమయంలో హంగ్ తప్పదని భావిస్తున్న కాంగ్రెస్ నేతలు ఎన్డీయేలో లేని ప్రాంతీయ పార్టీలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్లో మెజారిటీ అసెంబ్లీ, ఎంపీ సీట్లు వైసీపీకి దక్కుతాయన్న జాతీయ చానెళ్ల ఎగ్జిట్పోల్స్ అంచనాల నేపథ్యంలో ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కూడా ఎన్డీయేతర కూటమిలోకి లాగే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. జగన్కు ఆదివారం ఓ కాంగ్రెస్ నేత ఫోన్ చేసి ఎన్డీయేతర కూటమికి మద్దతివ్వాలని కోరారు. ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కూడా సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతివ్వాల్సిందిగా జగన్ను సోమవారం కోరారు.
అయితే, వైఎస్ జగన్ వ్యూహత్మకంగా స్పందిస్తూ... ఏ విషయమైనా ఫలితాలు వచ్చిన తర్వాతే చెబుతానని స్పష్టం చేశారు. జగన్ ఇచ్చిన పరిణతితో కూడిన స్పందన నేపథ్యంలో....వేచి చూసేందుకే కాంగ్రెస్ పక్షాలు సిద్ధమైనట్లు సమాచారం.