ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సహా ఆ పార్టీ నేతల తీరుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి అంబటి రాంబాబు తీవ్రంగా స్పందించారు. విజయవాడలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ టీడీపీ నేతల తీరును ఎద్దేవా చేశారు. నూటికి వెయ్యి శాతం గెలుస్తాను అని చెప్పుకోవాల్సిన దుస్థితి చంద్రబాబుకి ఎందుకు వచ్చిందని అంబటి ప్రశ్నించారు. `` పోలింగ్ తర్వాత బాబు చిత్రవిచిత్రంగా ప్రవరిస్తున్నాడు. వీవీప్యాట్, అధికారులు,ఈవీఎంలు ఇలా ప్రతీ అంశంపై నానా యాగీ చెస్తున్నారు. వీవీ ప్యాట్ల అంశంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. న్యూసెన్స్ పిటీషన్ అని సుప్రీంకోర్టు తిరస్కరించింది. అయినా....చంద్రబాబు ఎందుకింత ఫ్రస్టేషన్కు గురి అవుతున్నారు?`` అని అంబటి సూటిగా ప్రశ్నించారు.
చంద్రబాబు ఒక తుంటరి ఆటగాడిలా మిగిలిపోయారని అంబటి వ్యాఖ్యానించారు. ``చంద్రబాబుకి ఏ వ్యవస్థపై నమ్మకం లేదు, సుప్రీంకోర్టు మొట్టికాయలు వేసినా మారలేదు. ఇంటిలిజెన్స్ ఛీఫ్ బదిలీపై కూడా నానా రాధ్దాంతం చేశారు. తాజాగా మాజీ ప్రధాని ప్రణబ్ ముఖర్జీ ఒక మంచి వ్యాఖ్య చేశారు మంచి కార్మికుడు నెపాన్ని పనిముట్లపైకి నెట్టడు అని. దాని అర్థం గమనించు బాబు. చంద్రబాబు గెలిచె అవకాశం లేదని వ్యవస్థలని భ్రష్టు పట్టించారు. ఇప్పుడు వ్యవస్థను నమ్మని చంద్రబాబు రేపు ఫలితాలు కూడా నమ్మరు. ఈవీఎంలు గతంలో లేవా, నువ్వు గెలిచినప్పుడు ఇవే ఈవీఎంలే కదా బాబు? ఓటమి అంగీకరించలేక ఈవీఎంలపై నెపం నెట్టే ప్రయత్నం చేయడం ఎందుకు?`` అని సూటిగా ప్రశ్నించారు.
కౌంటింగ్ కేంద్రాలవద్ద అరాచకాలు సృష్టించాలని చూస్తున్నారని అంబటి ఆరోపించారు. ``కౌంటింగ్ కేంద్రం వద్ద టీడీపీ నేతలు అల్లర్లు సృష్టిస్తే ఎన్నికల సంఘం వెంటనే అణిచివేయాలి. చంద్రబాబు పిచ్చి భ్రమల్లో ఉన్నారు, పోలింగ్ పర్సెంటేజ్ పెరగడం నీ పిలుపు వల్ల కాదు. చంద్రబాబు ఢిల్లీ వెళ్లి ధర్నా చేయడం ఏంటి? కోర్ట్ స్పష్టంగా చెప్పినా ధర్నా చేస్తారా? మీరు ధర్నా చేస్తే ప్రజాస్వామ్యం పై నమ్మకంలేదనేది స్పష్టం అవుతుంది. ఇలా ప్రవర్తిస్తే ప్రజలు మిమ్మల్ని దండిస్తారు. చంద్రబాబు మీరు ఓడిపోయినప్పుడే హుందాగా ఉండాలి అలా చేసినప్పుడే మీరు పెద్దవారు కాగలగుతారు. మంత్రి దేవినేని ఉమ పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు.ఎగ్జిట్ పోల్స్ చూస్తూనే భయపడుతున్నారు. ఇక వాస్తవ ఫలితాలు చూస్తే ఏమైపోతారు. బుద్దా వెంకన్నా.. తొడ కొడితే నీ తొడ వాస్తుంది.ఇది బాలకృష్ణ దగ్గర నేర్చుకున్నట్లు ఉంది. ప్రజాస్వామ్యంలో తొడగొట్టడం కూడదు. టీడీపీ నేతలు పందికొక్కుల్లా తిన్నారు, కక్కిస్తాం జాగ్రత్త. 23న మీ ముఖాలు ఎక్కడ పెట్టుకుంటారు. మీ బండారం బయటపడిపోతుంది.మా గొప్పతనం కూడా తెలిస్తుంది.`` అని పేర్కొన్నారు.
శరద్ పవార్ వైసీపీ నేతలకు ఫోన్ చేశారనే ప్రచారం ఊహాగానమేనని అంబటి అన్నారు. ``జాతీయ రాజకీయాల్లో మా పాత్ర పై 23వతేదీ సాయంత్రం క్లారిటీ వస్తుంది. రాష్ట్ర ప్రయోజనాలే మాకు ముఖ్యం. చంద్రబాబు ఢిల్లీ హడావిడి అంతా వృథా ప్రయాస.మీకు బలం ఉంటే ఆ నేతలందరూ మీదగ్గరకే వస్తారు చంద్రబాబు. కాలిగాలిన పిల్లిలా చంద్రబాబు తిరుగుతున్నారు. అన్ని ఉన్న ఆకుల్లా మేం ఉంటాం.చంద్రబాబు ఏమిలేని ఆకులా ఎగిరెగిరిపడుతున్నారు.`` అని అంబటి స్పష్టం చేశారు.