ఇండియన్ సర్వీసెస్ నుంచి సామాజిక వేత్తగా మారి అక్కడి నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఆమ్ ఆద్మీ పార్టీని స్థాపించి ఢిల్లీలో సంచలన విజయం సాధించిన వ్యక్తి కేజ్రీవాల్. 70 స్థానాలకు గాను గత ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ 66 స్థానాలు గెలుచుకొని బీజేపీకి దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. ఈ స్థాయిలో విజయం సాధించిన ఆప్ ఈ లోక్ సభ ఎన్నికల్లో ఎన్ని స్థానాల్లో గెలుస్తుంది అన్నది ఆసక్తికరంగా మారింది.
ఎగ్జిట్ పోల్స్ సర్వే ప్రకారం ఆప్ ఢిల్లీలో ఒక్క స్థానం కూడా గెలుచుకోలేదని స్పష్టం చేస్తున్నాయి. దాదాపు అసలు ప్రతిపక్షమే లేనంతగా ప్రభావితం చేసిన ఓ పార్టీ లోక్ సభ ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెలుచుకోలేక పోతుంది అంటే అది ఒక రికార్డ్ అని చెప్పాలి. రాష్ట్రంలో ఒక పార్టీకి బలం ఉంది అంటే ఆ బలం లోక్ సభ ఎన్నికల్లో కూడా కనిపిస్తుంది. 2015 ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల తరువాత ఆప్ దేశవ్యాప్తంగా పోటీ చేయడం మొదలు పెట్టింది. పక్కనే ఉన్న హర్యానా, పంజాబ్ లో కూడా పోటీ చేసింది. కానీ, పెద్దగా ప్రభావం చూపలేకపోయింది.
దేశం మొత్తం వ్యాపించి జాతీయ పార్టీగా అవతరించాలనే కేజ్రీవాల్ కల కలాగానే మిగిలిపోయేలా కనిపిస్తోంది. ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్ ప్రకారం ఢిల్లీ లో ఉన్న 7 లోక్ సభ స్థానాల్లో మెజారిటీ స్థానాలను బీజేపీ కైవసం చేసుకుంటుందని తెలుస్తోంది. 2014 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఢిల్లీలోని 7 స్థానాలు కైవసం చేసుకుంది. ఈసారి మాత్రం స్వీప్ చేయలేకపోయినా మెజారిటీ స్థానాలు అంటే 5 స్థానాల్లో విజయం సాధిస్తుందని వార్తలు వస్తున్నాయి. ఎన్ని సీట్లు గెలుచుకుంటుంది అనేది రేపటితో తేలిపోతుంది.