దేశవ్యాప్తంగా అందరి చూపును తనవైపు తిప్పుకొన్న నిజామాబాద్ లోక్సభ స్థానం మరిన్ని ప్రత్యేకతలను తన ఖాతాలో జమ చేసుకోనుంది. రికార్డు స్థాయిలో నిజామాబాద్ లోక్సభ స్థానంలో 186 మంది పోటీ చేశారు. వీరిలో 176 మంది రైతులే కావడంతో.. ఈ ఎన్నిక దేశమంతటా ఆసక్తి రేపింది. మామూలుగా అయితే నిజామాబాద్ లో 14 టేబుళ్లతో కౌంటింగ్ ను నిర్వహించేవారు. అయితే 186 మంది (నోటా తో కలిపి) పోటీచేసే సరికి 36 టేబుళ్లను ఏర్పాటు చేస్తున్నారు. ఒక లోక్ సభ స్థానం ఓట్ల లెక్కింపుకు ఇన్ని టేబుళ్లను ఉపయోగించడం దేశంలోనే మొదటిసారి అని అధికారులు తెలిపారు.
నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలో 7 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా.. ఐదు అసెంబ్లీ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపును నిజామాబాద్ లో ఏర్పాటు చేశారు. మరో 2 నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు జగిత్యాలలో నిర్వహించనున్నారు. రౌండ్ రౌండ్కు ఫలితాన్ని.. నిజామాబాద్ నుంచే ప్రకటిస్తారు. ఈవీయంల సంఖ్యతో పాటూ ప్రతీ ఈవీయంలో 5 స్లిప్పులు లెక్కపట్టాల్సి ఉండటంతో ఒక్కో నియోజక వర్గానికి సుమారు ఒక గంట సమయం పట్టనుంది. కాగా, ఓట్ల కౌంటింగ్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ తెలిపారు. ఉదయం 6 గంటలకు అభ్యర్థుల సమక్షంలోనే స్ట్రాంగ్ రూంలను తెరుస్తామని చెప్పారు. ఉదయం 8 గంటలకు కౌంటింగ్ మొదలుపెడతామని చెప్పారు.
కాగా, నిజామాబాద్లో పోలింగ్ శాతం పెరగడంపై తమకు అనుమానాలున్నాయని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ప్రకటించి సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఎన్నికల ప్రధాన అధికారి రజత్ కుమార్ను కలిసి నిజామాబాద్లో 185 మంది అభ్యర్థులు బరిలో ఉన్నందున పోలింగ్ శాతం పెరగడంపై సీఈవోతో చర్చించారు. కౌంటింగ్ జరిగేటప్పుడు ఏవైనా సమస్య వస్తే ఆ ఈవీఎం మిషన్ ను మళ్లీ కౌంట్ చేయమని కోరామని ఆయన ప్రకటించడం ద్వారా నిజామాబాద్ ప్రక్రియపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.