దేశవ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తున్న సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ , ఫలితాలకు సంబంధించి ఇప్పటికే ఎగ్జిట్పోల్స్ ద్వారా ఓ స్పష్టత వచ్చిన సంగతి తెలిసిందే. మరికొద్ది గంటల్లో ఎవరు విజేతో తేలిపోనుంది. అయితే, ఈ కీలక తరుణంలో.... టీఆర్ఎస్ నేత, మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబానికి సన్నిహితుడు అనే పేరున్న ప్రశాంత్ రెడ్డి తాము టీఆర్ఎస్ పార్టీకే మద్దతు ఇస్తామన్నారు.
ఎన్నికలపై ఇష్టాగోష్టిగా మంత్రి మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో దేశ ప్రజలు ప్రధాని మోడీకి పూర్తి మెజారిటీ చేస్తే తాము చేసేదేమీ లేదని వ్యాఖ్యానించారు. అయితే, తాము మోడీ ప్రభుత్వంలో కలువబోమని, గతంలో లాగే బయటి నుంచే మద్దతు చేయొచ్చని అన్నారు. మోడీకి అవసరం లేకపోతే తామంతట తాము వెళ్లి కలవం అని చెప్పిన ప్రశాంత్ రెడ్డి…అడగకున్నా వెళ్లి కలిసేందుకు తామేం చంద్రబాబు కాదని వ్యాఖ్యానించారు.
ఫెడరల్ ఫ్రంట్ పేరుతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ వైపు ప్రాంతీయ కూటమిపై భారీ ఆశలు పెట్టుకోగా....ఆయన సన్నిహితుడనే పేరున్న మంత్రి ఈ వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా, ఎగ్జిట్ పోల్స్ ఎన్డీఏదే మళ్లీ అధికారముంటన్న సంగతి తెలిసిందే. మరోవైపు ఒకవేళ హంగ్ వస్తే.. ఎవరు కింగ్ మేకర్ అనే దానిపైనా ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. NDA, UPAకు సమదూరంలో ఉంటున్న TRS, TDP, YCP, BJD, SP, BSP, TMCలాంటి పార్టీల ఏ స్టెప్ తీసుకుంటాయన్నదానిపైనా చర్చలు జోరుగా నడుస్తున్నాయి. ఈ తరుణంలో...మంత్రి వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.