ఇటీవల తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మల్కాజ్ గిరి నుంచి మంచి మెజార్టీతో గెలుపొందారు టీఆర్ఎస్ నేత మైనంపల్లి హనుమంతరావు. తాజాగా మల్కాజ్గిరి ఎమ్మెల్యే నేత మైనంపల్లి హనుమంతరావుకు తీవ్ర గాయాలు అయ్యాయి. ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు చిక్కడపల్లిలోని ఓ హోటల్ కు ఆయన వచ్చిన వేళ, లిఫ్ట్ లో వెళుతుంటే, దాని వైర్ తెగింది.
ఈ ప్రమాదంలో మైనంపల్లికి గాయాలు కావడంతో హుటాహుటిన ఆయన్ను ఆసుపత్రికి తరలించారు. వివరాల్లోకి వెళితే.. గాంధీనగర్ కు చెందిన పార్టీ నేత ఎర్రం శ్రీనివాస్ గుప్తా కుమారుడి తొట్టెల కార్యక్రమానికి మైనంపల్లి విచ్చేశారు..ఈ నేపథ్యంలో గ్రౌండ్ ఫ్లోర్ కు కేవలం రెండు అడుగుల ఎత్తులనే వైర్ తెగడంతో ప్రమాదం జరిగింది.
మైనంపల్లి ఎడమకాలికి గాయమైందని వైద్యులు వెల్లడించారు. లిఫ్ట్ లో పరిమితికి మించి ఎక్కడంతోనే ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మైనంపల్లిని రాష్ట్ర మంత్రి మల్లారెడ్డి, ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ పరామర్శించారు.