ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో డ‌బ్బు వ‌ర‌ద‌లై పారింది. అధికారం చేపట్టడానికి రాజకీయ నాయకులు ఎంతైనా ఖర్చు పెడతారు... లెక్క ఎంతన్నది పట్టించుకోకుండా గెలవడం కోసం ఉన్నదంతా పంచుతుంటారనే భావ‌న‌ను నిజం చేస్తూ నేత‌లు డ‌బ్బు కుమ్మ‌రించారు. దేశవ్యాప్తంగా నగదును ఏరులై పారించిన ఉదంతంలో ఏపీ టాప్‌లో నిలిచింది. అయితే, ఇది ఖ‌ర్చు చేసిన డ‌బ్బు విష‌యంలో కాదండోయ్‌...ఎన్నికల సంఘం, పోలీసులు కలిసి ఎక్కడికక్కడ పెద్ద మొత్తంలో డబ్బు, మద్యం, ప్రజలను ప్రలోభపెట్టడానికి సిద్ధం చేసిన బహుమతులను పట్టుకున్న లెక్క‌ల‌కు సంబంధించి.



ఎన్నికల వేళ ఏపీలో పట్టుకున్న సొమ్ము 216.34కోట్లుగా ఈసీ ప్రకటించింది. దేశం మొత్తం  మీద ఈ ఎన్నికల వేళ 2628 కోట్ల నగదును ఈసీ స్వాధీనం చేసుకుంటే ఏపీలో స్వాధీనం చేసుకున్న సొమ్ము అందులో పది శాతంగా ఉండడం విశేషం.  2014 ఎన్నికల్లో దొరికిన నగదు కంటే.. ఈసారి 75 కోట్లు అదనంగా దొరికిందని ఈసీ వెల్లడించింది. ఇక ఇలా భారీ మొత్తంలో నగదు దొరికినా.. మన రాజకీయ నాయకులు దొంగచాటుగా ఇంకెన్నో వందల కోట్లు జనానికి పంచారు. పైపైన చెక్ చేస్తేనే ఇన్ని కోట్లు దొరికితే ఇక సీరియస్‌గా చెక్ చేస్తే ఇంకెన్ని కోట్లు దొరుకుతాయో అని విమర్శలు కూడా వచ్చాయి.


ఏపీలో స్వాధీనం చేసుకున్న రూ.216.34 కోట్లలో 26.31 కోట్లు విలువైన 6.70 లక్షల లీటర్ల మద్యాన్ని పోలీసులు సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ఇక దీనిలో విశాఖ ఏజెన్సీ నుంచి తరలిస్తున్న రూ.50 లక్షల విలువైన గంజాయి కూడా ఉంది. మరోవైపు తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా ఎన్నికల వేళ డబ్బు ఏరులై పారింది. ముఖ్యంగా ఏపీని మించి తమిళనాడులో భారీ మొత్తంలో నగదు దొరకడం గమనార్హం. తమిళనాడులో మొత్తం రూ.514 కోట్లు పట్టుబడగా… తెలంగాణలో రూ.77.49 కోట్లను సీజ్ చేశారు. ఇక సౌత్‌లో అత్యధిక సొమ్ము పట్టుబడిన రాష్ట్రంగా తమిళనాడు నిలవడం విశేషం. అలాగే ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్కో నియోజకవర్గంలో గెలవడానికి 50 కోట్లు కూడా ఖర్చు పెట్టిన నాయకులు ఉన్నారని ప‌లువురు అంటున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: