ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ఫలితాల్లో వైఎస్సార్సీపీ దాటికి హేమాహేమీలు మట్టికరుస్తున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు సొంత నియోజకవర్గం కుప్పంలో సైతం ఆయన స్థాయికి తగిన పెర్పామెన్స్ చేయలేకపోతున్నారు. ఇక పదిమందికి పైగా మంత్రులు విఫలమవుతున్నారు. ఇవన్నీ ఇలా ఉంటే మంగళగిరిలో మంత్రి నారా లోకేష్ ఘోర ఓటమి దిశగా వెళుతున్నారు. రెండు, మూడు రౌండ్ల కౌంటింగ్ ముగిసేసరికి లోకేష్ మంగళగిరిలో వెనకంజలో నిలిచారు.
వైఎస్సార్సీపీ అభ్యర్థి, సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి(ఆర్కే) తొలి రెండు రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే సరికి 14 వేల ఓట్ల ఆధిక్యంతో దూసుకెళ్తున్నారు. ప్రస్తుతం కౌంటింగ్ తాడేపల్లి మండలంతో పాటు తాడేపల్లి మునిసిపాలిటీ పరిధిలో జరుగుతోంది. ఇక మంగళగిరి రూరల్, మంగళగిరి మునిసిపాలిటీల్లో కూడా వైసీపీ ఆధిక్యం కనపరుస్తోందన్న అంచనాలు ఉన్నాయి. ఇక చివరిగా దుగ్గిరాల మండలంలోని ఓట్లను లెక్కిస్తారు. ఇప్పుడు ఉన్న ట్రెండ్స్ బట్టి చూస్తే లోకేష్ 25 వేల ఓట్ల పై చిలుకు మెజార్టీతో ఓడిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఎమ్మెల్యేగా గెలవని లోకేష్ను నమ్మి బాబు పార్టీ పగ్గాలు అప్పగిస్తే టీడీపీ భవిష్యత్తు అంధకారమే అనుకోవాలి.