ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో అఖండ మెజారిటీ దిశగా వైసీపీ అప్రతిహతంగా దూసుకుపోతోంది. మొత్తం 175 సీట్లలో ఏకంగా 150 సీట్లతో అప్రతిహతంగా దూసుకుపోతోంది. 1983లో ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు.. ఆ తర్వాత 1985, 1994 ఎన్నికల్లో ఎన్టీఆర్ ఎలాంటి ప్రభంజనం క్రియేట్ చేశారో ? ఇప్పుడు అదే తరహా ప్రభంజంనాన్ని జగన్ క్రియేట్ చేస్తున్నారు.
ఇక చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులోనూ వైసీపీ దూసుకుపోతోంది. బాబు పోటీ చేసిన ఒక్క కుప్పం నియోజకవర్గం మినహా మిగిలిన అన్ని నియోజకవర్గాల్లోనూ వైసీపీ ఆధిక్యం సాధిస్తోంది. ప్రధానంగా చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఆర్కే రోజా ఆధిక్యాన్ని ప్రదర్శిస్తున్నారు. టీడీపీ, ఇతర పార్టీల తప్పుడు అంచనాలు, లెక్కలకు ధీటుగా ఆమె దూసుకుపోతున్నారు. రెండో రౌండ్ ముగిసేసరికి టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాశ్ పై రోజా మెజారిటీతో గెలుపు దిశగా పయనిస్తున్నారు.
గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమనాయుడిపై పోటీ చేసిన స్వల్ప తేడాతో గెలిచిన రోజా ఈ ఎన్నికల్లో ఆయన తనయుడు గాలి భానుప్రకాశ్ నాయుడిపై భారీ మెజార్టీతో దూసుకుపోతున్నారు. కౌంటింగ్ ముగిసే సరికి చూస్తే రోజా భారీ మెజార్టీతో ఘనవిజయం సాధించడం... ఆమె జగన్ కేబినెట్లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.