ఆంధ్రప్రదేశ్ లో తిరుగులేని విజయం సాధించించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వై.ఎస్. జగన్మోహన్ రెడ్డికి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ వెలువడుతుండడంతో వైసీపీ అభ్యర్థులు ఏకంగా 150 నియోజకవర్గాల్లో దూసుకుపోతున్నారు. అధికార టీడీపీ కేవలం 27 స్థానాలతోనే సరిపెట్టుకునేలా ఉంది. ఇక ఎంపీ సీట్ల విషయానికి వస్తే టీడీపీ కేవలం ఒక్క సీటులో మాత్రమే ఆధిక్యంలో ఉంది. ఇక ఏపీలో గెలిచిన జగన్కు కేసీఆర్ ఫోన్ చేసి అభినందనలు తెలిపారు. జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని ఆయన ఆకాంక్షించారు. రెండు తెలుగు రాష్ట్రాలను కలిసి అభివృద్ధి చేస్తామని ఆయన చెప్పారు. కేంద్రంలో విజయం సాధించిన నరేంద్ర మోడీకి సైతం కేసీఆర్ శుభాకాంక్షలు తెలిపారు.