ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడిగా ఎమ్మెల్సీ అయిపోయి, మంత్రి అయిన లోకేష్ తొలిసారి ప్రత్యక్ష ఎన్నికను ఎదుర్కొన్నారు. ఎమ్మెల్యేగా నెగ్గడం అనే విషయంలో లోకేష్ సత్తా చూపిస్తారా, లేదా అనేది చర్చనీయాంశంగా మారగా....ఆయన ఓటమి వైపు సాగుతున్నారు.ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాల్లో 134 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతోంది. 25 పార్లమెంట్ స్థానాల్లో 24 సెగ్మెంట్లలో వైసీపీ ఆధిక్యంలో దూసుకెళ్తోంది. ఓటమి పరంపరలో లోకేష్ ఉండటం గమనార్హం.
మరోవైపు కర్ణాటక రాష్ట్రంలోని మాండ్యాలో జేడీఎస్-కాంగ్రెస్ అభ్యర్థి, కుమారస్వామి కుమారుడు నిఖిల్ సైతం ఓటమి దిశగా సాగుతున్నారు. అక్కడ స్వతంత్ర అభ్యర్థిగా బరిలో ఉన్న సినీ నటి సుమలత ముందంజలో ఉన్నారు. ఈ ఎన్నికల్లో నిఖిల్ మద్దతుగా చంద్రబాబునాయుడు ప్రచారం చేశారు. తన సొంత కుమారుడిని గెలిపించుకోలేకపోతున్న చంద్రబాబు..అటు తను ప్రచారం చేసిన ముఖ్యమంత్రి తనయుడిని సైతం గెలిపించలేరనే భావనను సైతం చంద్రబాబు మూటగట్టుకుంటారని అంటున్నారు. మరోవైపు, చంద్రబాబు ఇతర రాష్ట్రాల్లో ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో గెలుపు ఓటములపై సైతం పలువురు ఆసక్తికరంగా చర్చించుకుంటున్నారు.