ఎట్టకేలకు ఏపీలో టీడీపీకి ఊరటనిచ్చే ఓ గెలుపు లభించింది. ఓ వైపు మహామహులు, మంత్రులు వరుస పెట్టి చిత్తుచిత్తుగా ఓడిపోతున్నారు. ఏకంగా చంద్రబాబు తనయుడు మంత్రి లోకేష్తో సహా 15 మంది మంత్రులు ఓటమి బాటల్లో విలవిల్లాడుతున్నారు. మరోవైపు చంద్రబాబు కూడా 25 వేల మెజార్టీతోనే గెలిచిన పరిస్థితి. ఇక టీడీపీకి ఊరట ఇచ్చేలా ఓ మంత్రి విజయం సాధించారు. ఆ మంత్రి ఎవరో కాదు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నుంచి పోటీ చేసిన హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప.
గత ఎన్నికల్లో గెలిచిన చినరాజప్పను ఓడించేందుకు ఈ సారి జగన్ కాకినాడ తాజా మాజీ ఎంపీ తోట నరసింహంను వైసీపీలోకి ఆహ్వానించి ఆయన భార్య తోట వాణిని అక్కడ నుంచి రంగంలోకి దింపారు. తోట వాణి రాజప్పకు చివరి వరకు గట్టి పోటీ ఇచ్చారు. చివర్లో తోట వాణిపై రాజప్ప కేవలం 4 వేల ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. మహామహులు మట్టికరుస్తోన్న ఈ పోలింగ్లో రాజప్ప గెలుపు పెద్ద సంచలనమే.