బాలయ్యను నందమూరి అందగాడు అని ఆయన అభిమానులు, టీడీపీ అభిమానులు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు. ఈ ఎన్నికల్లో ఈ నందమూరి అందగాడే ఒక్క మగాడిగా నిలిచి పరువు నిలుపుకున్నాడు. ఈ ఎన్నికల్లో నారా, నందమూరి ఫ్యామిలీల నుంచి బాలయ్య, బాలయ్య ఇద్దరు అల్లుళ్లతో పాటు ఆయన వియ్యంకుడు చంద్రబాబు మొత్తం నలుగురు ఎన్నికల్లో పోటీ చేశారు. ఈ ఎన్నికల్లో గత ఎన్నికలతో పోలిస్తే వీరికి బాగా చుక్కెదురైంది.
జగన్ ప్రభంజనం ధాటికి కుప్పంలో చంద్రబాబు సైతం కొన్ని రౌండ్లలో వెనకపడిపోయారు. గత ఎన్నికల్లో 47 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన చంద్రబాబు ఈ ఎన్నికల్లో వైసీపీ దెబ్బతో కేవలం 30 వేల మెజార్టీతో సరిపెట్టుకున్నారు. చంద్రబాబుకే అంతలా వైసీపీ ఫ్యాన్ గాలి తగిలింది అంటే ఇక లోకేష్, విశాఖలో భరత్ లాంటి వాళ్లు ఎక్కడ ఆగుతారు.
అయితే ఇంతలా వీచిన ఫ్యాన్ ప్రభంజనాన్ని తట్టుకుని మరీ హిందూపురంలో బాలయ్య గెలుపు బాటలో దూసుకుపోతున్నారు. అనంతపురం జిల్లాలో టీడీపీ అభ్యర్థుల్లో హిందూపురంలో నందమూరి బాలకృష్ణ ఒక్కరే గెలుపు దిశగా సాగుతున్నారు. 8వ రౌండ్ కౌంటింగ్ పూర్తయ్యే సరికి 12,062 ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్థి అభ్యర్థి మహ్మద్ ఇక్బాల్పై విజయం సాధించే దిశగా ఆధిక్యంలో కొనసాగుతున్నారు.
ఇక హిందూపురం మరోసారి నందమూరి ఫ్యామిలీ వజ్రపుకోట అని రుజువైంది. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పటి నుంచి ఆ పార్టీకి కంచుకోటగా ఉన్న హిందూపురం నియోజకవర్గాన్ని 2019 ఎన్నికల్లో కూడా ఆయన వారసుడిగా బాలకృష్ణ పదిలం చేయబోతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ‘ఫ్యాన్’ గాలి జోరుగా వీస్తున్న తరుణంలో జిల్లాలో ‘ఒక్క మగాడు’గా బాలకృష్ణ టీడీపీ ఖాతా తెరవబోతున్నారు.