భువనగిరి లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయం సాధించడం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. టీఆర్ఎస్‌ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ పై స్వల్ప ఓట్ల తేడాతో గెలుపొందారు. ఎన్నికల కౌంటిగ్ ప్రారంభమైనప్పట్నుంచి ఇద్దరి మధ్యన టఫ్ ఫైటింగ్ కొనసాగింది. రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తించిన భువనగిరి విజయం చివరకు కోమటిరెడ్డిని వరించింది. ఇవాళ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి బర్త్ డే కావడంతో ఈ విజయం ఆయనకు పెద్ద గిఫ్ట్ అని సంబరాలు చేసుకుంటున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు.

అయితే, ఈ ఫ‌లితాల అనంత‌రం కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో నిజామాబాద్‌ నుంచి మరోసారి పోటీ చేసిన సీఎం కేసీఆర్ కూతురు కవితపై సెటైర్లు వేశారు. ``నేను కేసీఆర్‌కి, కేటీఆర్‌కి ఛాలెంజ్ చేసి భువనగిరి ఎంపీ స్థానం నుంచి మా అన్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని  గెలిపించుకున్నా` అని ప్రకటించారు. నల్గొండలో చెల్లని రూపాయి భువనగిరిలో చెల్లుతుందా అని మా అన్నను ఎద్దేవా చేశారు... మరి ఇప్పుడు నీ బిడ్డే చెల్లని రూపాయి అయ్యిందని రాజగోపాల్ రెడ్డి సెటైర్లు వేశారు. ఇక జెడ్పీటీసీ ఎన్నికల్లో సూర్యాపేట, నల్గొండ, యాదాద్రి భువనగిరి మూడు జడ్పీ ఛైర్మెన్ సీట్లు కైవసం చేసుకుంటామని సవాల్ చేశారు కోమటిరెడ్డి. మరోవైపు రేపు ఎమ్మెల్సీగా నా సతీమణి లక్ష్మీ కూడా గెలువబోతోందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని ఖునీ చేస్తున్న కేసీఆర్ కి ప్రజలు బుద్ధి చెప్పారని వ్యాఖ్యానించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: